రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంగళవారం (జూన్ 3) చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ను ఓడించి 18 ఏళ్ల తర్వాత తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయం సాధించడానికి 11 మంది ఆటగాళ్ళు కృషి చేసినప్పటికీ, ఫ్రాంచైజీ క్రికెట్లో తన కలను నెరవేర్చుకున్న భారత లెజెండ్ విరాట్ కోహ్లిపై అందరి దృష్టి పడింది. ఆయన భార్య, నటి అనుష్క శర్మ కూడా స్టేడియంలో ఉండి, విరాట్, ఆర్సీబీ కోసం మ్యాచ్లో చీర్ చేసింది.
ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఛేదనలో 20వ ఓవర్ చివరి బంతి కంప్లీట్ కాగానే విరాట్ కోహ్లి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. విరాట్ నేలమీద కూలబడి, తన ముఖాన్ని చేతులతో కప్పుకొన్నాడు. అనుష్క శర్మ కూడా స్టాండ్స్లో అలాగే చేసింది. ఆ తర్వాత ఆ నటి ఆనందంతో దూకి, ప్రైవేట్ బాక్స్లో తన పక్కన ఉన్నవాళ్లతో సంబరాలు చేసుకుంది.
ఆర్సీబీ విజేతగా నిలవడంతో అనుష్క సంబరాలు కొనసాగాయి. బౌండరీ బయట ఉండి కేరింతలు కొడుతూనే ఉంది. కాసేపటికే భార్య కోసం వెతుకుతూ విరాట్ వచ్చాడు. విరాట్ పరిగెత్తి వచ్చి ఆమెను హత్తుకున్నాడు. ఆ సమయంలో విరాట్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అనుష్క శర్మ కూడా విరాట్ ను హత్తుకుని ఎమోషనల్ అయింది. విరాట్ తల నిమురుతూ, భుజం తడుతూ అభినందించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
అంతకంటే ముందు ఆర్సీబీ మాజీ ఆటగాడు, దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఎమోషనల్ అయ్యాడు. గ్రౌండ్ లోకి వచ్చి విరాట్ కోహ్లిని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు ఫ్యాన్స్ ‘ఏబీడీ’ అంటూ నినాదాలతో స్టేడియాన్ని మార్మోగించారు.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆర్సీబీ అద్భుతంగా పుంజుకుని తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. సూపర్స్టార్ కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేయడంతో ఆర్సీబీ ఫస్ట్ 190/9తో ఇన్నింగ్స్ ముగించింది. అయితే పంజాబ్ బ్యాటింగ్ డెప్త్ చూస్తే ఈ స్కోరు సరిపోదేమో అనిపించింది. కానీ తీవ్ర ఒత్తిడిలోనూ బౌలింగ్ లో ఆర్సీబీ అదరగొట్టింది.
ఛేజింగ్ లో పంజాబ్ కు చివరి ఓవర్లో 29 పరుగులు అవసరమైనప్పుడు.. హేజిల్వుడ్ వరుసగా రెండు డాట్ బాల్స్ వేయడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
సంబంధిత కథనం