OTT Horror Thriller: హారర్ థ్రిల్లర్ జానర్ మెచ్చే ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. నాలుగేళ్ల కిందట నేరుగా ఓటీటీలోకి వచ్చి వణికించిన చోరీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం (మార్చి 25) టీజర్ రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2021లో చోరీ అనే మూవీ వచ్చింది. బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను వణికించింది. ఇందులోని ట్విస్టులు, నటీనటుల నటన ఆకట్టుకున్నాయి. ఓ మారుమూల గ్రామంలోని ఓ పొలంలోనే మొత్తం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ప్రైమ్ వీడియోలోకే వచ్చింది.
ఇప్పుడీ మూవీకి సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా పేరు చోరీ 2. ఈ హారర్ థ్రిల్లర్ ఏప్రిల్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులను భయపెట్టడానికి ఈ మధ్యకాలంలో జానపదాలను వాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ చోరీ మూవీ కూడా అలా వచ్చిందే. తాజాగా చోరీ 2 టీజర్ కూడా భయపెట్టేలానే సాగింది.
“మరోసారి అదే పొలం, అదే ప్రమాదం, అదే భయం కలగబోతున్నాయి” అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో మంగళవారం (మార్చి 25) తన ఎక్స్ అకౌంట్లో ఈ టీజర్ ను పోస్ట్ చేసింది.
నాలుగేళ్ల కిందట వచ్చిన చోరీ మూవీ ఓ గర్భవతి, ఆమెకు ఆశ్రయం కల్పించి చంపాలని చూసే ఓ మహిళ చుట్టూ తిరిగింది. ఆ సినిమాను 2017లో వచ్చిన మరాఠీ మూవీ లపాచపీ ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడీ సీక్వెల్ లో ఆ గర్భవతికి పుట్టిన ఆడబిడ్డ ప్రమాదంలో చిక్కుకున్నట్లుగా చూపించబోతున్నారు. తాజాగా వచ్చిన టీజర్ చూస్తుంటే ఆమెతోపాటు ఆమె కూతురు కూడా ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
చోరీ 2 మూవీని విశాల్ ఫూరియా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో నుష్రత్ బరూచాతోపాటు సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజని, సౌరభ్ గోయల్, పల్లవి అజయ్, కుల్దీప్ సరీన్, హార్దికా శర్మ నటించారు. సీక్వెల్లోనూ నుష్రత్.. మొదటి భాగంలోని సాక్షి పాత్రలో నటించింది. సోహా అలీ ఖాన్ దెయ్యంలా కనిపించింది.
2021లో వచ్చిన చోరీ మూవీ ప్రేక్షకులను భయపెడుతూనే థ్రిల్ ను పంచింది. దీంతో ఇప్పుడీ సీక్వెల్ పై అంచనాలను మరింత భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 11 నుంచి చోరీ 2 మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
సంబంధిత కథనం