హిట్ 3 సినిమా టికెట్ల ధరలు పెంపు.. ఒక్కో టికెట్‌పై ఎంత పెరిగిందంటే?-hit 3 movie ticket price hike in andhra pradesh rs 50 for single screen and 75 for multiplex ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హిట్ 3 సినిమా టికెట్ల ధరలు పెంపు.. ఒక్కో టికెట్‌పై ఎంత పెరిగిందంటే?

హిట్ 3 సినిమా టికెట్ల ధరలు పెంపు.. ఒక్కో టికెట్‌పై ఎంత పెరిగిందంటే?

Hari Prasad S HT Telugu

హిట్ 3 సినిమా టికెట్ల ధరలను పెంచడానికి అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్ 30) ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం (మే 1) ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందు టికెట్ల ధరలను పెంచేందుకు అనుమతించారు.

హిట్ 3 సినిమా టికెట్ల ధరలు పెంపు.. ఒక్కో టికెట్‌పై ఎంత పెరిగిందంటే?

నాని, శ్రీనిధి శెట్టి నటించిన మూవీ హిట్: ది థర్డ్ కేస్. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురువారం (మే 1) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్ ఇప్పటికే సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న నిర్మాతల అభ్యర్థనకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీలో హిట్ 3 టికెట్ల ధరలు ఇలా..

హిట్ 3 మూవీ టికెట్ల ధరలు పెంచడానికి అనుమతిస్తూ బుధవారం (ఏప్రిల్ 30) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ లో గరిష్ఠంగా రూ.50, మల్టీప్లెక్స్‌లో గరిష్ఠంగా రూ.75 పెంచుకోవచ్చు. జీఎస్టీతో కలిపి ఈ మొత్తం పెంచడానికి అనుమతించారు.

పెంచిన ధరలు ఏడు రోజుల పాటు అమల్లో ఉంటాయి. హిట్ 3 నిర్మాతల అభ్యర్థన మేరకు ధరల పెంపునకు అనుమతించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

హిట్ 3 మూవీ గురించి..

హిట్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మూడో సినిమా ఇది. హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ అంటూ ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. తొలి మూవీలో విశ్వక్సేన్, రెండో సినిమాలో అడవి శేష్ నటించగా.. ఇప్పుడు మూడో సినిమాలో నాని లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఒక్కో భాగంలో ఒక్కో కేసు, దానిని ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదిస్తాడన్న కథలతో డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.

హిట్ 3లో ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నాడు. సీరియల్ కిల్లింగ్ కు పాల్పడిన ముఠాను పట్టుకోవడానికి జమ్ముకశ్మీర్ లో అర్జున్ సర్కార్ చేసే సాహసాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ మూవీ ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి నటించింది.

ఈ గురువారం (మే 1) థియేటర్లలో సినిమా రిలీజ్ కాబోతోంది. గతంలో వచ్చిన రెండు సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ కావడంతో ఈ మూడో సినిమాపై అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. అందులోనూ నాని నటిస్తుండటంతో అతని కెరీర్లో మరో రూ.100 కోట్ల హిట్ పడబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో టికెట్ల ధరల పెంపునకు అనుమతించిన నేపథ్యంలో తొలి రోజు వసూళ్లే భారీగా ఉండే అవకాశం ఉంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం