సూర్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రెట్రో నుంచి వచ్చిన కలెక్షన్స్లో పది కోట్లను పేద విద్యార్థుల చదువు కోసం విరాళంగా అందజేశాడు. అగరం ఫౌండేషన్ సభ్యులకు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో కలిసి సూర్య చెక్ అందిస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సూర్య గొప్ప మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తోన్నారు.
అగరం ఫౌండేషన్ను సూర్యనే స్థాపించాడు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక భద్రతను పెంపొందించే ఉద్దేశంతో 2006లో ఈ ఫౌండేషన్ను నెలకొల్పారు.
కాగా రెట్రో బుధవారం నాటితో వంద కోట్ల కలెక్షన్స్లోకి అడుగుపెట్టినట్లు నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించింది. 104 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ఓ పోస్టర్ను అభిమానులతో పంచుకున్నది. తమిళంలో మినహా మిగిలిన భాషల్లో ఈ మూవీ తేలిపోయింది.
ఫస్ట్ వీక్ పూర్తయ్యేలోగా ఈ మూవీ వరల్డ్ వైడ్గా యాభై కోట్ల షేర్ కలెక్షన్స్ను దాటినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఒక్క తమిళంలోనే ఈ మూవీ నలభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటకలో మాత్రం డిజాస్టర్గా నిలిచింది.
తెలుగులో సూర్యకు ఉన్న క్రేజ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. దాదాపు పదిన్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ రిలీజైంది. ఏడు రోజుల్లో ఏడు కోట్ల వరకు గ్రాస్, మూడున్నర కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకో ఏడు కోట్లకుపైనే కలెక్షన్స్ రావాల్సివుంది. కలెక్షన్స్ రోజురోజుకు తగ్గుముఖం పట్టడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.
తమిళంలో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన రెట్రో మూవీ తెలుగులో మాత్రం నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. వరల్డ్ వైడ్గా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు 52 శాతం వరకు మాత్రమే రికవరీ సాధించినట్లు చెబుతోన్నారు.
రెట్రో మూవీకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని సూర్య, కార్తీక్ సుబ్బరాజు కలిసి నిర్మించారు. రెట్రో తర్వాత తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ మూవీ చేయబోతున్నాడు.
సంబంధిత కథనం