దిగ్గజ నటుడు కమల్ హాసన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన అమరన్ మూవీ దీపావళి కానుకగా గురువారం థియేటర్లలోకి వచ్చింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ట్విట్టర్లో పాజిటివ్గానే స్పందిస్తున్నారు. దాంతో ప్రొడ్యూసర్గా కమల్ హాసన్ మరో హిట్ను ఖాతాలో వేసుకున్నట్లే. కానీ.. అదే సమయంలో ఓ వివాదంలోనూ కమల్ హాసన్ ఇరుక్కున్నాడు.
శింబుతో చేస్తున్న పాన్ ఇండియా ఎంటర్ టైనర్ మూవీ ‘శింబు 48’ ప్రొడ్యూసర్ బాధ్యతల నుంచి కమల్ హాసన్ తప్పుకున్నాడు. 'మానాడు', 'వెంధు తనిదండ కాడు', 'పాతు తలా' తదితర చిత్రాలతో మళ్లీ గాడినపడిన శింబు.. కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో ‘శింబు 48’ చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఓ 2-3 షెడ్యూల్స్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. కానీ.. కారణాలు చెప్పకుండానే కమల్ హాసన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘శింబు 48’ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సమయంలో ఇలా షూటింగ్ అకస్మాత్తుగా ఆగిపోవడం శింబు అభిమానుల్ని కలవరపరుస్తోంది. ఈ సినిమాలో శింబు డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. రాజ్ కమల్ ఫిలిమ్స్కి ఇది 48వ సినిమాకాగా.. అమరన్ రిలీజ్ ముంగిట కమల్ హాసన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
నటుడు సిలంబరసన్ (శింబు)ని అతని తండ్రి రాజేంద్రన్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా తొలుత అరంగేట్రం చేయించి.. 2002లో కాదల్ అళిజిల్లాయ్ అనే సినిమాతో హీరోగా పరిచయం చేశాడు. ఆ తరువాత రొమాంటిక్ చిత్రాల్లో తన మార్క్ని చాటుకున్న శింబు భిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలతో అభిమానుల్ని మెప్పించాడు.
కానీ.. దాదాపు కెరీర్లో కొన్నేళ్ల పాటు శింబు చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నాడు. నయనతారతో ప్రేమాయణం, వివాదాలు, సినిమాలు ఫెయిల్యూర్ ఇలా శింబుకి ఏదీ కలిసిరాలేదు. 2019 నుంచి 2021 వరకు శింబు నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు.
మూడేళ్ల క్రితం వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా వచ్చిన మానాడు చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమా డిఫరెంట్ టైమ్ లూప్ స్టైల్ లో రూపొందింది. కెరీర్లో శింబుకు కూడా చాలా మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత గౌతమ్ మీనన్ తో కలిసి వెందు తనిదా కాడు సినిమా కూడా ఆదరణ పొందింది. ఈ దశలో కమల్ హాసన్కి చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్తో మూవీ అనగానే అంచనాలు రెట్టింపయ్యాయి.
దేశింగు పెరియసామి దర్శకత్వంలో శింబు నటిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దాని ప్రభావం మణిరత్నం చిత్రం ‘థగ్ లైఫ్’పై పడే అవకాశం ఉంది. ఈ సినిమాలో కమల్ తమ్ముడి పాత్రలో శింబు నటించనున్నాడు. అలానే అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో శింబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి.
కమల్ హాసన్ సడన్గా శింబు 48 నుంచి తప్పుకోవడంతో.. శింబు నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తానే సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని చిత్ర యూనిట్కి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. అమరన్ రిలీజ్ ముంగిట ఈ వివాదంపై మాట్లాడేందుకు కమల్ హాసన్ ఇష్టపడలేదు.