Guppedantha Manasu May 26th Episode: చేయని తప్పుకు కాలేజీకి దూరమైన రిషి - శైలేంద్ర ప్లాన్ రివర్స్
Guppedantha Manasu May 26th Episode: మిషన్ ఎడ్యుకేషన్ చెక్ను రిషినే అక్రమంగా సారథికి ఇచ్చాడని వసుధార అబద్ధం ఆడుతుంది. ఆమె మాటలతో రిషి కాలేజీకి దూరం కావాల్సివస్తుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu May 26th Episode: మిషన్ ఎడ్యుకేషన్ చెక్ను రిషి అక్రమంగా సారథికి ఇచ్చాడనే ఆరోపణలు వస్తాయి. మినిస్టర్ సారథ్యంలో విచారణ మొదలవుతుంది. వసుధార ఆన్సర్ మీదే రిషి తప్పు చేశాడా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుంది. నిజం చెప్పమని మినిస్టర్తో పాటు రిషి అడిగినా వసుధార మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. వసుధారపై రిషి ఫైర్ అవుతాడు. సమాధానం చెప్పమని గట్టిగా నిలదీసినా ఆమె మాత్రం మౌనం వీడదు. రిషి జీవితం, జగతికి ఇచ్చిన మాట మధ్య నలిగిపోతుంటుంది. ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరకు ఆ చెక్ రిషి ఇచ్చాడని అబద్ధం చెబుతుంది. వసుధార సమాధానంతో రిషి షాక్ అవుతాడు.
వసుధార అబద్ధం…
వసుధార మాటల్ని ఫణీంద్ర అబద్ధం అని కొట్టిపారేస్తాడు. రిషి తప్పుచేయడని అంటాడు. తప్పు చేయకపోతే ఈ సాక్ష్యాలు ఎలా వస్తాయని జగతి అంటుంది. శైలేంద్ర కూడా రిషికి సపోర్ట్ చేస్తున్నట్లుగా నాటకం ఆడుతాడు. వసుధార అబద్ధం చెబుతుందని కోపంగా మాట్లాడుతాడు. నా కళ్లల్లోకి సూటిగా చూసి చెప్పు...ఆ చెక్ నేను ఇచ్చానా అని మరోసారి వసుధారను నిలదీస్తాడు రిషి. రిషి కళ్లల్లోకి చూసి మీరే ఆ చెక్ ఇచ్చారు అని వసుధార సమాధానం చెబుతుంది.
చేయని తప్పును ఒప్పుకున్న రిషి...
ఈ చెక్ ఈష్యూపై నువ్వు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని రిషిని అడుగుతాడు మినిస్టర్. జగతి మేడమ్, వసుధార ఇద్దరు నేను తప్పు చేశానని నిరూపించారు కాబట్టి తాను చెప్పడానికి ఏం లేదని రిషి ఎమోషనల్ అవుతాడు. తప్పు చేశాను...మనుషుల్ని నమ్మి తప్పు చేశానని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మోసం చేశాను....నా మనస్సాక్షిని మోసం చేశాను.
అడ్డంగా దొరికిపోయి దోషిగా నిలబడ్డానని అంటాడు. మనుషుల విషయంలో నా అంచనాలు తప్పాయని చెబుతాడు. అంతకుమించి తప్పు ఇంకేం ఉంటుందని అంటాడు. నేను చేసిన తప్పును నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. దోషిగా నేను మీ ముందు ఉన్నాను. నాకు శిక్ష పడాలని రిషి అంటాడు. ఈ రుషేంద్ర భూషణ్కు మీరు వేసే శిక్ష ఏమిటో చెప్పమని రిషి అందరిని అడుగుతాడు. ఈ విషయంలో జగతినే తీర్పు చెప్పాలని మినిస్టర్ అంటాడు.
కాలేజీ నుంచి రిషి దూరం...
కాలేజీ ఎండీ బాధ్యతల నుంచి రిషి తప్పుకోవాలని జగతి తీర్పు చెబుతుంది. కాలేజీతో రిషికి ఎలాంటి సంబంధం ఉండకూడదని అంటుంది. ఇతర విద్యాసంస్థల్లో ఎండీగా బాధ్యతలు చేపట్టడానికి వీలులేదని జగతి చెబుతుంది.రిషి కాలేజీకి దూరం కానుండటంతో ఎండీ సీట్ తనకే దక్కుతుందన్న ఆనందంలో శైలేంద్ర ఉంటాడు.
కానీ ఇంతలోనే అతడికి మినిస్టర్ ఊహించని షాక్ ఇస్తాడు. రిషి తర్వాత కాలేజీ ఎండీ బాధ్యతల్ని జగతి చేపట్టబోతున్నట్లు చెబుతాడు. జగతిని ఎండీగా అపాయింట్ చేస్తూ రెండు నెలల క్రితమే రిషి తనకు లెటర్ పంపించాడని చెబుతాడు. ఇందుకు బోర్డు సభ్యుల ఆమోదం కూడా ఉందని చెబుతాడు.
ప్లాన్ రివర్స్...
తమ ప్లాన్ రివర్స్ కావడంతో శైలేంద్ర, దేవయానిలకు ఏం అర్థం కాదు. రిషి కూడా జగతి మేడమ్ ఇక నుంచి డీబీఎస్టీ కాలేజీ ఎండీ అని అంటాడు. కాలేజీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. మీరు విధించిన శిక్షను సంతోషంగా స్వీకరిస్తానని అంటాడు. ఇది అభియోగం మాత్రమేనని, నిజం నిరూపించి కాలేజీ ఎండీ బాధ్యతల్ని తిరిగి స్వీకరించవచ్చని రిషితో అంటుంది జగతి. కానీ రిషి మాత్రం తనకు ఆ అవసరం లేదని, ఈ క్షణం నుంచి ఇంట్లోనే కాదు మీ జీవితాల్లో కూడా ఉండలేనని సమాధానం చెబుతాడు. రిషి ఆన్సర్ విని వసుధార ఎమోషన్ అవుతుంది.
అందరికి దూరంగా వెళ్లిపోయిన రిషి...
ఇప్పుడు ఈ రిషి మోసగాడు. నేరస్తుడు. శిక్షను మోస్తూ మీ ముందు ఉండలేను. అందుకే ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్లిపోతున్నానని అంటాడు. తనను ఎవరూ ఆపవద్దని, ఇక నుంచి రిషి ఒంటరి అని అంటాడు. వసుధార అతడికి ఏదో చెప్పాలని ప్రయత్నించిన ఆమె మాట వినడు. తప్పుకు శిక్ష అనుభవించాలి. ఇది నాకు నేను విధించుకున్న శిక్ష అని చెబుతాడు.
ఈ సంఘటన తన జీవితంలో ఓ మచ్చ అని అంటాడు. నా చుట్టూ ఉన్న మనుషుల మీద ఓ క్లారిటీ వచ్చింది. ఎవరేంటో పూర్తిగా తెలిసిందని అంటాడు. ఇక్కడ నా అవసరం లేదు. నాకు ఎవరూ అవసరం లేదని ఎమోషనల్గా మాట్లాడుతాడు. వెళ్తున్నానని శైలేంద్ర, దేవయానిలతో మాత్రమే చెప్పి రూమ్ నుంచి వేగంగా బయటకు వెళతాడు. అతడిని ఆపేందుకు జగతి, వసుధార అతడి వెంట వెళతారు.
ఆనందంలో దేవయాని, శైలేంద్ర...
రిషిని కాలేజీకి దూరం చేయాలనే తమ ప్లాన్ ఫలించినందుకు దేవయాని, శైలేంద్ర ఆనందపడతారు. కానీ ఎండీ సీట్ తనకు దక్కకపోవడంతో శైలేంద్ర అసంతృప్తిగా ఉంటాడు. ఎండీ సీట్ను జగతికి ఇవ్వాలని రిషి ఎందుకు నిర్ణయం తీసుకున్నాడన్నది ఇద్దరికి అంతుపట్టదు. జగతిని నుంచి డీబీఎస్టీ కాలేజీని ఈజీగా చేజిక్కించుకోవచ్చని దేవయాని అంటుంది. కానీ శైలేంద్ర మాత్రం ఆమె మాటలతో ఏకీభవించడు. జగతి చాలా తెలివైంది.
తనకు ధైర్యం ఎక్కువని సమాధానమిస్తాడు. జగతికి తెలివితేటలు, ధైర్యంతో పాటు భయం ఎక్కువేనని దేవయాని అంటుంది. ఆమె భయాన్ని ఉపయోగించుకొనే రిషిని డీబీఎస్టీ కాలేజీ నుంచే కాకుండా సిటీకి దూరంగా పంపించామని అంటాడు. అదే భయంతోనే జగతిని ఎండీ సీట్ నుంచి దూరంగా పంపించాలని అనుకుంటారు. రిషికి ఆత్మాభిమానం ఎక్కువని, రిషి మళ్లీ సిటీలో అడుగుపెట్టే అవకాశం లేదని ఇద్దరూ సంతోషపడతారు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.