బాలీవుడ్ నటి దిశా పటానీకి ఖుష్బూ పటానీ అనే సోదరి ఉన్నారు. ఆమె గతంలో భారత ఆర్మీలో ఆఫీసర్గానూ పని చేశారు. ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్గా, వ్యాపారవేత్తగా ఉన్నారు. తాజాగా ఖుష్బూ పటానీ చేసిన ఓ పనికి చాలా ప్రశంసలు దక్కుతున్నాయి. తప్పిపోయిన ఓ పాప మళ్లీ తన తల్లి దగ్గరికి చేరేలా ఖుష్బూ సాయం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
బరేలీలోని తమ ఇంటి సమీపంలో ఓ పాప తప్పిపోయి కనిపించిందని ఏప్రిల్ 20న ఖుష్బూ పటానీ ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. ఖుష్బూ, ఆమె తల్లి కలిసి ఆ పాపను ఇంటికి తీసుకెళ్లారు. ఆహారం తినిపించారు. చికిత్స చేయించారు. ఆ తర్వాత ఆ పాపను పోలీసులకు అప్పగించారు.
ఇది జరిగిన రెండు గంటలకు అప్డేట్ ఇచ్చారు ఖుష్బూ పటానీ. ఆ పాప తల్లిదండ్రుల వివరాలు తెలిశాయని వెల్లడించారు. ఆ పాపను తల్లి తీసుకెళ్లారని తెలిపారు. ప్రయాణంలో ఉండగా తమ పాపను ఎవరో ఎత్తుకెళ్లారని తల్లి చెప్పినట్టు వెల్లడించారు. ఖుష్బూ సహకారంతో ఆ పాప మళ్లీ తల్లి చెంతకు చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఖుష్బూ.. ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.
ఖుష్బూ పటానీ చేసిన పని పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశానికి కావాల్సిందే నీలాంటి వాళ్లే అంటూ కొందరు కామెంట్లు చేశారు. నువ్వు రియల్ హీరో అంటూ దిశా పటానీ కూడా కామెంట్ రాశారు. లవ్ సింబల్ పెట్టారు భూమి పడ్నేకర్.
తల్లి దగ్గరికి ఆ పాపను చేర్చిన ఖుష్బూ పనికి చాలా మంది ఫిదా అవుతున్నారు. చాలా మానవత్వం చూపారని, అద్భుతమైన పని చేశారని చాలా మంది రాసుకొస్తున్నారు. రియల్ హీరో.. సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆ పాపను ఖుష్బూ పటానీ కాపాడిన విషయాన్ని వివరించారు పోలీస్ ఆఫీసర్ పంకజ్ శ్రీవాత్సవ. గోడ దూకి ఆ పాప ఉన్న ప్లేస్కు వెళ్లారని తెలిపారు. “ఇంటి సమీపంలో ఆ పాప ఏడుపు ఖుష్బూకు వినిపించింది. కానీ అక్కడికి వెళ్లేందుకు సరైన దారి లేదు. దీంతో గోడ ఎక్కి.. దూకి సాహసం చేసి అక్కడికి వెళ్లారు. అక్కడ ఏడుస్తున్న పాపను చూశారు. వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. ముఖంపై గాయమైన ఆ పాపకు ప్రథమ చికిత్స చేయించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు” అని శ్రీవాత్సవ తెలిపారు. మొత్తంగా ఎంతో కష్టపడి ఆ పాపను కాపాడిన ఖుష్బూ.. తల్లి చెంతకు చేర్చగలిగారు.
సంబంధిత కథనం