రాజమౌళి అంటేనే భారీతనానికి మారుపేరు. అతని సినిమాల్లో చాలా వరకూ భారీ బడ్జెట్వే. అలాంటి దర్శకుడు ఇప్పుడో చిన్న సినిమాను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఇది తప్పకుండా చూడాల్సిన మూవీ అని అంటున్నాడు. కేవలం రూ.14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. బాక్సాఫీస్ దగ్గర సూర్య నటించిన రెట్రోకే చెమటలు పట్టిస్తున్న సినిమా ఇది.
తమిళ కామెడీ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. మే 1న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను చూసిన రాజమౌళి.. తన ఎక్స్ అకౌంట్ ద్వారా చిన్న రివ్యూ ఇచ్చాడు. చాలా అద్భుతమైన సినిమా అని, అందరూ కచ్చితంగా చూడాలని అతడు అనడం విశేషం.
“ఓ అద్భుతమైన, అద్భుతమైన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ చూశాను. మనసుకు హత్తుకునే, చక్కిలిగింతలు పెట్టే హాస్యంతో కూడిన సినిమా. మొదటి నుంచి చివరి వరకూ ఆసక్తిగా చూశాను. అభిషన్ జీవింత్ గొప్ప రైటింగ్, డైరెక్షన్. ఈ మధ్యకాలంలో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్యూ. ఈ సినిమా మిస్ కావద్దు” అని రాజమౌళి అన్నాడు.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. శ్రీలంక నుంచి వచ్చి తమిళనాడులో సెటిలయ్యే ఓ చిన్న ఫ్యామిలీ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కొవిడ్ తోపాటు అక్కడి ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆ కుటుంబం జాఫ్నాను వీడి తమిళనాడుకు వస్తుంది.
అప్పటి వరకూ అంటీ ముట్టనట్లుగా ఉండే అక్కడి వాళ్లు ఈ కుటుంబం వచ్చిన తర్వాత వాళ్ల ప్రేమానురాగాల కారణంగా ఓ మంచి కమ్యూనిటీగా మారిపోతుంది. ఈ క్రమాన్ని దర్శకుడు అభిసన్ జీవింత్ హాయిగా నవ్వుకునేలా చిత్రీకరించాడు. ఈ సినిమా సూర్య నటించిన రెట్రోతోపాటు రిలీజైనా.. తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీని మించి వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రావడం విశేషం.
టూరిస్ట్ ఫ్యామిలీకి ఐఎండీబీలో ఏకంగా 8.6 రేటింగ్ నమోదైంది. చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. దీంతో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే 31 నుంచి జియోహాట్స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత కథనం