నాగచైతన్య లీడ్ రోల్లో మయసభ పేరుతో తెలుగులో ఓ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్సిరీస్ తెరకెక్కుతోన్నట్లుగా కొన్నాళ్లుగా టాలీవుడ్ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ వెబ్సిరీస్పై డైరెక్టర్ దేవా కట్టా శనివారం క్లారిటీ ఇచ్చారు. ఈ వెబ్సిరీస్లో నాగచైతన్య నటించడం లేదని పేర్కొన్నారు.
మయసభ వెబ్సిరీస్లో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న నటీనటులు ఎవరన్నది ట్విట్టర్ ద్వారా దేవా కట్టా వెల్లడించారు. మయసభ వెబ్సిరీస్లో ఆది పినిశెట్టి, చైతన్యరావు లీడ్ యాక్టర్స్గా కనిపించబోతున్నట్లు దేవా కట్టా చెప్పారు.
వీరిద్దరితో పాటు సాయికుమార్, నాజర్, దిద్యా దత్తా, తాన్య రవిచంద్రన్, రవింద్ర విజయ్, శత్రు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. చైతన్యరావు పేరు చూసి చాలా మంది నాగచైతన్యగా పొరపడ్డారని. ఈ వెబ్సిరీస్లో నాగచైతన్య నటించడం లేదని దేవా కట్టా ట్వీట్ చేశాడు. మయసభ వెబ్సిరీస్ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం ఫైనల్ సౌండ్ మిక్సింగ్ పనులు జరుగుతోన్నట్లు దేవా కట్టా పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలను మలుపు తిప్పిన రాజకీయ సంఘటనల ఆధారంగా మయసభ వెబ్సిరీస్ తెరక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న స్నేహం, రాజకీయ వైరంతోపాటు వారి పొలిటికల్ జర్నీలోని కీలక ఘట్టాలను ఈ సిరీస్లో చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకే పార్టీ ద్వారా పొలిటికల్ జర్నీని మొదలుపెట్టిన వైఎస్ రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు నాయుడు వేర్వేరు పార్టీల్లో చేరి రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారన్నది ఈ వెబ్సిరీస్లో ఆవిష్కరించనున్నట్లు తెలిసింది.
మయసభ సీజన్ 1 రన్ టైమ్ నాలుగు వందల నిమిషాలు ఉంటుందని ఇటీవలే దేవా కట్టా వెల్లడించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మయసభ రిలీజ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలిసింది.
వెన్నెల మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు దేవా కట్టా. కామెడీ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ప్రస్థానం సినిమాతో దేవా కట్టా అవార్డులను అందుకున్నాడు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ సినిమాలను తెరకెక్కించాడు.
సంబంధిత కథనం