క్రైమ్ థ్రిల్లర్ జానర్ కంటెంట్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చిన అది సూపర్ హిట్టే అవుతుంది. అలా జియోహాట్స్టార్ ఓటీటీలో 2019లో తొలిసారి వచ్చిన వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్. ఈ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకోగా.. నాలుగో సీజన్ రెడీగా ఉంది.
సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే ఏప్రిల్ 5, 2019లో క్రిమినల్ జస్టిస్ తొలి సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. అది కాస్తా సూపర్ హిట్ అవడంతో తర్వాత మరో రెండు సీజన్లను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు నాలుగో సీజన్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ పేరుతో వస్తోంది. ఈ కొత్త సీజన్ మే 22 నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మంగళవారం (ఏప్రిల్ 29) ఈ సీజన్ టీజర్ రిలీజ్ చేశారు. లాయర్ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠీ) సరికొత్త కేసుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత మూడు సీజన్లలాగే ఈ కొత్త సీజన్లోనూ కావాల్సినంత క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కోర్ట్ రూమ్ డ్రామా ఉండనున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ ఓ జంట ప్రేమ, హత్య చుట్టూ తిరగనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. మొదట్లోనే తనకో లాయర్ కావాలంటూ మాధవ్ మిశ్రా దగ్గరికి ఓ అమ్మాయి వస్తుంది. ఈ కేసు అనుకున్నంత సులువు కాదు.. లేదంటే నా దగ్గరికి వచ్చేదే కాదంటూ అతడు అంటాడు.
తర్వాత ఓ అమ్మాయి హత్య, కోర్టు రూమ్ వాదనలు చాలా ఇంటెన్స్ గా ఈ టీజర్లో కనిపిస్తాయి. దీని ద్వారా అసలు స్టోరీ ఏంటన్నదానిపై స్పష్టత రాలేదు. అయితే గత మూడు సీజన్లలాగే మాధవ్ మిశ్రా ఈసారి కూడా తన ఎత్తులు పైఎత్తుల ద్వారా కోర్టు వాదనలను రక్తి కట్టించబోతున్నట్లు మాత్రం తెలుస్తోంది.
ఈ క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్లో పంకజ్ త్రిపాఠీతోపాటు చాలామంది సీనియర్ నటీనటులు నటించారు. మహ్మద్ జీషాన్ ఆయుబ్, సుర్వీన్ చావ్లా, శ్వేతా బసు ప్రసాద్, మీటా వశిష్ట్, ఆశా నేగి లాంటి వాళ్లు ఇందులో కనిపించారు. రోహన్ సిప్పి ఈ సిరీస్ డైరెక్ట్ చేశాడు. అప్లౌజ్ ఎంటర్టైన్మెంట్, బీబీసీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
క్రిమినల్ జస్టిస్ 2019లో తొలి సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2008లో వచ్చిన బ్రిటీష్ టీవీ సిరీస్ ఆధారంగా దీనిని తెరకెక్కించారు. తిగ్మాంశు ధూలియా, విశాల్ ఫూరియా డైరెక్ట్ చేశారు. విక్రాంత్ మస్సే, పంకజ్ త్రిపాఠీ, జాకీ ష్రాఫ్ లాంటి వాళ్లు నటించారు. పది ఎపిసోడ్లు ఉన్న ఈ తొలి సీజన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక డిసెంబర్, 2020లో రెండో సీజన్ వచ్చింది. అందులోనూ లాయర్ మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠీ తిరిగి వచ్చాడు. అందులో కీర్తి కుల్హరి లీడ్ రోల్లో నటించింది. ఇక ఆగస్ట్, 2022లో మూడో సీజన్ కూడా రిలీజ్ చేశాడు. మొత్తానికి సుమారు మూడేళ్ల తర్వాత ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతోంది. మే 22 నుంచి క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం