ప్రతి వారం సరికొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలల్లో రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా, ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన తెలుగు సినిమాల్లో డియర్ ఉమ ఒకటి. లవ్ అండ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన డియర్ ఉమ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం వహించారు.
డియర్ ఉమ సినిమాతో తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్గా పరిచయం అయింది. అనంతపురానికి చెందిన సుమయ రెడ్డి డియర్ ఉమకు రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. పృథ్వీ అంబర్ హీరోగా చేసిన ఈ సినిమాలో కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ ఫేమ్ పృథ్వీరాజ్ నటించారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా సినిమా విడుదలకు ముందు డియర్ ఉమ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నటుడు పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ .. "సాయి రాజేష్ అద్భుతంగా డియర్ ఉమ చిత్రాన్ని తీశారు. సుమయ రెడ్డి గారు ఇచ్చిన కథ నిజంగానే అద్భుతంగా ఉంటుంది. ఆ కథను మరింత అద్భుతంగా తీశారు" అని అన్నారు.
"అప్పట్లో విక్టరీ వెంకటేష్ బాబు చేసిన గణేష్ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. అందులో హాస్పిటల్ వ్యవస్థను చూపించారు. డియర్ ఉమ చిత్రంలోనూ అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. అందరికీ అవగాహన కల్పించేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి" అని 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వీరాజ్ కోరారు.
ఇదే ఈవెంట్లో డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ .. "డియర్ ఉమ చిత్రం కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడింది. బుర్రకథ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పని చేశాను. అక్కడే సుమయ రెడ్డి గారిని కలిశాను. ఆ తరువాత ఓ షార్ట్ ఫిల్మ్కి పని చేశాం. కరోనా టైంలో సుమయ రెడ్డి గారు ఓ కథ రాశారు. అది నాకు చాలా నచ్చింది. అలా డియర్ ఉమ చిత్రం మొదలైంది" అని చెప్పారు.
"మేం ఈ కథను నమ్మి చాలా మంది వద్దకు తిరిగాం. కానీ, కథలో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సుమయ రెడ్డి గారే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వాలని ఆమె సినిమాను నిర్మించారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా టీంలోకి వచ్చారు" అని దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు.
"రాజ్ తోట గారి కెమెరా వర్క్ అందరికీ నచ్చుతుంది. రదన్ గారి సంగీతం అద్భుతంగా వచ్చింది. సుమయ రెడ్డి గారి నటన, పృథ్వీ అంబర్ గారి యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటంది. మా చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. మా వెనకాల ఎవ్వరూ లేరు. మాకు మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ కావాలి. సమాజానికి ఈ సినిమా అవసరం ఉంది. అందుకే చిత్రాన్ని తీశాం. డియర్ ఉమ సినిమాను అందరూ తప్పకుండా చూడండి" అని డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం