Tollywood Senior Heroes vs Young Heroes: సీనియర్ల జోరు - స్పీడు తగ్గించిన యంగ్ హీరోస్
Tollywood Senior Heroes vs Young Heroes: ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున జోరుమీదున్నారు. ఓ సినిమా సెట్స్ఫై ఉండగానే వరుసగా సినిమాల్ని ప్రకటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. మరోవైపు యంగ్ హీరోస్ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తోన్నారు. ఓ సినిమా తర్వాతే మరో సినిమా అనే పాలసీని అనుసరిస్తున్నారు. ఒక్కో సినిమా మాత్రమే చేస్తోన్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో సీనియర్, యంగ్ హీరోలు చేస్తోన్న సినిమాలు ఇవే...
Tollywood Senior Heroes vs Young Heroes:
స్పీడు పెంచిన చిరు
సెకండ్ ఇన్నింగ్స్లో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఓ సినిమా సెట్స్పై ఉండగానే మూడు సినిమాల్ని లైన్లో పెట్టాడు. ఈ ఏడాది ఆచార్య, గాడ్ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు చిరు. ఇందులో ఆచార్య ఫ్లాప్ కాగా గాడ్ఫాదర్ కమర్షియల్ హిట్గా నిలిచింది.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న వాల్తేర్ వీరయ్య సినిమాను పూర్తి చేసే పనిలో చిరు బిజీగా ఉన్నాడు. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ మరో హీరోగా నటిస్తోన్నాడు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.
మరోవైపు మోహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. 2023లో వాల్తేర్ వీరయ్య, భోళాశంకర్ సినిమాలతో చిరంజీవి ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. సినిమాతో పాటుగా వెంకీ కుడుములతో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. మరికొన్ని ప్రాజెక్ట్లు ఫైనల్ స్టేజ్లోనే ఉన్నట్లు సమాచారం.
బాలయ్య నాలుగు సినిమాలు...
చిరుతో పాటు మరో సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) కూడా ఫుల్ జోష్ మీదున్నాడు. వీరసింహారెడ్డితో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం రాయలసీమలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వీరసింహారెడ్డి సెట్స్పై ఉండగానే అనిల్ రావిపూడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలకృష్ణ. యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలుకానుంది. ఈ సినిమాలతో పాటుగా ఆదిత్య 369 సీక్వెల్ కోసం కథ సిద్ధం చేస్తోన్నట్లు ఇటీవలే బాలకృష్ణ ప్రకటించారు. బాలకృష్ణ, పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలయ్య జోరు చూస్తే వచ్చే ఏడాది అభిమానులకు పండుగలాగే ఉంది.
నాగ్ మల్టీస్టారర్...
బ్రహ్మాస్త్ర సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చాడు నాగార్జున(Nagarjuna). సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అలాగే దసరాకు ది ఘోస్ట్తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోకుండా త్వరలోనే గాడ్ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు నాగార్జున అనౌన్స్ చేశాడు. మళ్లీ సినిమాల స్పీడు పెంచాడు మాస్ మహారాజా రవితేజ. ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో పాటు వాల్తేర్ వీరయ్య సినిమాల్లో నటిస్తున్నాడు.
ప్రభాస్ ఒక్కడే...
స్టార్ హీరోల్లో ప్రభాస్ (Prabhas) మాత్రమే నాలుగు సినిమాలు చేస్తోన్నాడు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు రావడంతో జూన్కు వాయిదావేశారు. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు దాదాపు ఏడాది కాలంగా షూటింగ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాలు యాభై శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ సినిమాలు సెట్స్పై ఉండగానే ఇటీవలే డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను మొదలుపెట్టాడు ప్రభాస్.
మహేష్ ఫస్ట్ టైమ్
కెరీర్ ఆరంభం నుంచి ఓ సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు మహేష్ (Mahesh babu). మొదటిసారి ఆ రూల్ను బ్రేక్ చేస్తూ ఒకే సారి రెండు సినిమాల్ని అనౌన్స్ చేశారు. ఈ ఏడాది సర్కారు వారి పాటతో సంక్రాంతి రేసులో నిలిచిన మహేష్ బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏడెనిమిది నెలల పాటు గ్యాప్ తీసుకున్న మహేష్ ఇటీవలే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు.
రాజమౌళితో భారీ అడ్వెంచర్ సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వచ్చే ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్పైకి రానుంది. రాజమౌళితో సినిమా అంటే ఓ పట్టానా షూటింగ్ కాదు. ఈ సినిమా కోసమే మహేష్ ఏడాది మొత్తం టైమ్ కేటాయించబోతున్నట్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్ లేట్...
ఆర్ఆర్ఆర్ విడుదలై ఎనిమిది నెలలు దాటిన కొత్త సినిమా సెట్స్లో అడుగుపెట్టలేదు ఎన్టీఆర్ (Ntr). కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్లను లైన్లో పెట్టాడు ఎన్టీఆర్. కొరటాల శివ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరిలో ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. ప్రభాస్ సలార్ పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా మొదలుకానుంది.
శంకర్ సినిమా ఒక్కటే...
రామ్చరణ్ (Ramcharan) చేతిలో కూడా ప్రస్తుతం ఒక్క సినిమా మాత్రమే ఉంది. శంకర్ పాన్ ఇండియన్ సినిమాపై మాత్రమే పూర్తిగా చరణ్ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ జరిగే స్పీడు చూస్తుంటే వచ్చే ఏడాది చివరలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
చైతూ బైలింగ్వల్...
అక్కినేని హీరోల్లో నాగచైతన్య (Naga Chaitanya) ప్రజెంట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో బైలింగ్వల్ సినిమా చేస్తున్నాడు. చైతూ సినిమా ఇదొక్కటే సెట్స్పై ఉంది. పరశురామ్ దర్శకత్వంలో చైతూ ఓ సినిమా అనౌన్స్చేశాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలయ్యేది క్లారిటీ లేదు. అఖిల్ కూడా ఏజెంట్ సినిమాతో గత రెండేళ్లుగా కుస్తీలు పడుతోన్నాడు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ స్పై యాక్షన్ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
నాని జోరు తగ్గింది...
ఎప్పుడూ రెండు, మూడు సినిమా షూటింగ్లతో బిజీగా కనిపించే నాని (Nani)కూడా ప్రజెంట్ ఒక్క సినిమా మాత్రమే కమిట్ అయ్యాడు. దసరా సినిమా మాత్రమే చేస్తున్నాడు. శర్వానంద్ రెండు సినిమాల్ని అంగీకరించినా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. అల్లు అర్జున్ది అదే పరిస్థితి. పుష్ప -2 షూటింగ్ పూర్తయిన తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెలలోనే పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానుంది. సాయిధరమ్తేజ్, వరుణ్తేజ్ ఒక సినిమా తర్వాత మరో సినిమా పాలసీనే అనుసరిస్తున్నారు.