Bellamkonda Srinivas : నాతో నటించేందుకు ఆ హీరోయిన్స్ ఒప్పుకోలేదు
Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి రోజుల్లో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చాడు.
తెలుగులో చివరిసారిగా అల్లుడు అదుర్స్(Alludu Adhurs) సినిమాలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి(chatrapathi) సినిమాను హిందీలో రీమేక్ చేశాడు శ్రీనివాస్. వచ్చే వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తన కెరీర్, ఆర్థిక సమస్యలు గురించి వివరించాడు.
వివి.వినాయక్(VV Vinayaak) దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను(Alludu Srinu) సినిమాతో శ్రీనివాస్ కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమా విజయం సాధించినా శ్రీనివాస్ మళ్లీ వెండితెరపై కనిపించడానికి దాదాపు మరో రెండేళ్లు పట్టింది. తన జీవితంలో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలిపాడు.
తన తండ్రి నిర్మాత కావడం వల్లనే సినిమాల్లోకి ఈజీగా రాగలిగానని అందరూ అనుకుంటున్నారని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నాడు. అది నిజమేనని, కానీ కష్టపడి పని చేయడం వల్లే పరిశ్రమలో కొనసాగానని చెప్పాడు. తన మొదటి సినిమా అల్లుడు శీను బ్లాక్బస్టర్గా నిలిచిందని, ఆ సినిమాకు తన తండ్రి నిర్మాత అని, ఆయన చాలా సపోర్ట్ చేశారని శ్రీనివాస్ వెల్లడించాడు. అయితే సమంత(Samantha), తమన్నా(tamanna) తనతో పని చేయడానికి మెుదట్లో అంగీకరించలేదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ ఇలా ఒక్కొక్కటి 5 నిమిషాల డెమో వీడియోను రూపొందించి వారికి పంపించానని తెలిపాడు.
ఆ వీడియో చూసి స్టార్ హీరోయిన్లిద్దరూ సినిమా చేయడానికి అంగీకరించారట. మరోవైపు అప్పటికే బెల్లంకొండ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలిపాడు శ్రీనివాస్. బెల్లంకొండ సురేష్ కు కొన్ని సినిమాలు నష్టాలను తెచ్చిపెట్టాయి. తనపై ఒత్తిడి పెరగడంతో తనకు వచ్చిన చాలా అవకాశాలను తిరస్కరించానని శ్రీనివాస్ తెలిపాడు. ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చున్నాడు. ఆ తర్వాత తక్కువ బడ్జెట్తో సినిమా చేశాడు. తనపై నమ్మకం ఉంచి బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహించిన జయ జానకి నాయక చిత్రంతో తాను అన్ని విధాలుగా నిలబడ్డానని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఛత్రపతి సినిమా మే 12 విడుదల కానుంది. ఇందులో నుష్రత్ భారుచ్చా, ఫ్రెడ్డీ దారువాలా, శరద్ ఖేల్కర్, రాజేంద్ర గుప్తా కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా బ్యాక్ డ్రాప్ ను మార్చి.. యాక్షన్ ఎంటర్ టైనర్ గా హిందీ ఛత్రపతిని తీశారు. పెన్ స్టూడియోస్ పతాకంపై ధవల్ జయంతి లాల్ గడ, అక్షయ్ జయంతి లాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మించారు. తనిష్క్ బాఘ్చి, రవి బస్రూర్ సంగీతం అందించారు.