నటిగా ఉన్నా.. తర్వాత ఎంపీ అయినా కంగనా రనౌత్ వివాదాలకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. గురువారం (మే 15) ఉదయం ఆమె చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీలను పోలుస్తూ చేసిన ఆ ట్వీట్ తర్వాత డిలీట్ చేసింది. ఆమె ఏం డిలీట్ చేసిందో కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపడంతో దీనిపై తాజాగా మరో ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో చూడండి.
ఇండియాలో ఆపిల్ ఉత్పత్తుల తయారీని నిలిపేయాలని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ను ట్రంప్ ఆదేశించారన్న వార్తల నేపథ్యంలో కంగనా రనౌత్ ఓ ట్వీట్ చేసింది. “ఈ బంధాన్ని వదులుకోవాలన్నదాని వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది.
1. ఆయన అమెరికా అధ్యక్షుడే కావచ్చు కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే నేత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్.
2. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చారు కానీ భారత ప్రధానికిది మూడోసారి.
3. ట్రంప్ ఆల్ఫా మేల్ అనడంలో సందేహం లేదు కానీ మా పీఎం సాబ్ ఆల్ఫా మేల్ కా బాప్. మీరేమంటారు? ఇది వ్యక్తిగత ఈర్ష్యనా లేక దౌత్యపరమైన అభద్రతాభావమా” అని కంగనా ట్వీట్ చేసింది.
కంగనా చేసిన ఈ ట్వీట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె డిలీట్ చేసింది. అయితే ఆమె డిలీట్ చేసిన ట్వీట్ ఏదో స్క్రీన్ షాట్ తీసి స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అనే ఎక్స్ అకౌంట్ పోస్ట్ చేసింది. దీనిపై తాజాగా కంగనా స్పందించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పడం వల్లే తాను ఆ ట్వీట్ డిలీట్ చేసినట్లు ఆమె వివరణ ఇచ్చింది.
“గౌరవనీయులైన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాజీ నాకు కాల్ చేసి ఆ ట్వీట్ డిలీట్ చేయాలని చెప్పారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ కు ట్రంప్ ఇండియాలో తయారీ వద్దని చెప్పడానికి సంబంధించి నేను చేసిన ట్వీట్ అది. నా సొంత అభిప్రాయాన్ని అలా పోస్ట్ చేసినందుకు చింతిస్తున్నాను. వచ్చిన ఆదేశాల ప్రకారం నేను వెంటనే ఇన్స్టాగ్రామ్ లోనూ డిలీట్ చేశాను. థ్యాంక్స్” అని కంగనా చెప్పింది.
ఇండియాలో ఆపిల్ ఉత్పత్తుల తయారీని నిలిపేయాల్సిందిగా సీఈవో టిమ్ కుక్ కు తాను చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికాలోనే వాటిని తయారు చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఖతార్ లో ఈ ఇద్దరూ కలుసుకున్నారు. కుక్ తో తనకు చిన్న సమస్య ఉన్నదని, ఆయన తమ ఉత్పత్తులన్నింటినీ ఇండియాలోనే చేస్తున్నారని అన్నారు. తాను చెప్పడం వల్ల ఆపిల్ అమెరికాలో తమ ఉత్పత్తుల తయారీ పెంచబోతున్నట్లు ట్రంప్ తెలిపారు.
సంబంధిత కథనం