Champions Trophy Team India: భారత జట్టుకు ఎదురుదెబ్బ.. ఇంటికి తిరిగి వెళ్లిన కోచ్.. కారణం ఇదే!-big blow for india ahead of champions trophy as bowling coach morne morel returns home ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Champions Trophy Team India: భారత జట్టుకు ఎదురుదెబ్బ.. ఇంటికి తిరిగి వెళ్లిన కోచ్.. కారణం ఇదే!

Champions Trophy Team India: భారత జట్టుకు ఎదురుదెబ్బ.. ఇంటికి తిరిగి వెళ్లిన కోచ్.. కారణం ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 18, 2025 10:19 AM IST

Champions Trophy Team India: ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు టీమిండియాకు ఇబ్బంది ఎదురైంది. బౌలింగ్ కోచ్ జట్టుకు దూరమయ్యాడు. సొంత ఇంటికి వెళ్లిపోయాడు.

భారత జట్టు
భారత జట్టు

ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా సిద్ధమవుతోంది. దుబాయ్‍లో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టోర్నీ రేపు (ఫిబ్రవరి 19) మొదలుకానుండగా.. తన తొలి మ్యాచ్‍ను బంగ్లాదేశ్‍తో ఫిబ్రవరి 20న భారత్ ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేనల్ స్టేడియంలో టీమిండియా తలపడనుంది. ఇంతలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తలిగింది. భారత బౌలింగ్ కోచ్ మార్న్ మోర్కెల్ జట్టుకు దూరమయ్యాడు. తన స్వదేశం దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు.

కారణం ఏంటంటే..

మార్న్ మోర్కెల్ తండ్రి మృతి చెందారని దైనిక్ జాగరణ్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ఆదివారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‍లో మోర్కెల్ ఉన్నా.. రెండో సెషల్‍లో కనిపించలేదని పేర్కొంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు దుబాయ్ నుంచి మోర్కెల్ బయలుదేరాడని ఆ రిపోర్ట్ వెల్లడించింది.

టీమిండియాకు ఇబ్బంది

మోర్కెల్ మళ్లీ భారత జట్టుతో ఎప్పుడు జాయిన్ అవుతాడో క్లారిటీ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి అసలు అతడు అందుబాటులోకి వస్తాడో లేదో అనేది కూడా చూడాలి. ఇప్పటికే స్టార్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా ఈ టోర్నీకి గాయం వల్ల దూరమవడం భారత్‍కు పెద్ద లోటు. ఇప్పుడు పేస్ దళం భారం ఎక్కువగా మహమ్మద్ షమీపై ఉంది. అతడు కూడా గాయం నుంచి కోలుకొని ఇటీవలే జట్టులోకి వచ్చాడు. అర్షదీప్ సింగ్‍కు టీ20ల్లో మంచి రికార్డు ఉన్నా.. వన్డేలకు కొత్తే. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పేస్ దళం ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో బౌలింగ్ కోచ్ మోర్కల్ కూడా దూరం కావడం భారత్‍కు ఎదురుదెబ్బగా మారింది.

టీమిండియా సోమవారం కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. అయితే, మంగళవారం ప్రాక్టీస్‍కు గ్యాప్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఓ రోజు విరామం తీసుకుంటే మేలని మేనేజ్‍మెంట్ భావిస్తోంది. బుధవారం మళ్లీ ప్రాక్టీస్ చేయనున్నారు భారత ఆటగాళ్లు. బంగ్లాదేశ్‍తో గురువారమే (ఫిబ్రవరి 20) ఆడనుంది టీమిండియా.

భారత్ ప్రస్తుతం మంచి ఫామ్‍లో ఉంది. ఇటీవలే స్వదేశంలో ఇంగ్లండ్‍ను వన్డే సిరిస్‍లో 3-0తో చిత్తు చేసింది. అన్ని విభాగాల్లో రాణించి సత్తాచాటింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్‍తో సిరీస్‍లో సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‍లోకి రావడం టీమిండియాకు మంచి పరిణామంగా ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే అన్ని మ్యాచ్‍లు దుబాయ్ వేదికగా జరుగుతాయి. మిగిలిన మ్యాచ్‍లు పాకిస్థాన్‍లో జరగనున్నాయి. ఎనిమిది జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా ఉండనుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం