పద్మ అవార్డులు 2025 సెర్మనీ సోమవారం (ఏప్రిల్ 28) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. ఇందులో టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణతోపాటు అజిత్, శేఖర్ కపూర్, అరిజిత్ సింగ్, రిక్కీ కేజ్ లాంటి వాళ్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. ఇక సింగర్ పంకజ్ ఉధాస్ కు మరణానంతరం ఈ అవార్డు దక్కింది.
పద్మ అవార్డుల కోసం బాలకృష్ణ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లాడు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రజలను మెప్పించడంతోపాటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవలందిస్తున్న ఘనత బాలయ్యది.
దీంతో అతనికి దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ దక్కింది. ఈ కార్యక్రమానికి అతడు పంచకట్టులో రావడం విశేషం. భార్య వసుంధర, తనయుడు మోక్షజ్ఞ, కూతురు బ్రాహ్మణి, అల్లుడు లోకేశ్ లతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వచ్చిన బాలయ్య.. ఈ అవార్డు అందుకున్నాడు.
బాలకృష్ణతోపాటు పలువురు ఇతర సినిమా ఇండస్ట్రీలకు చెందిన వాళ్లు కూడా పద్మ అవార్డులు అందుకున్నారు. తమిళ స్టార్ అజిత్ కుమార్ కు కూడా పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ఓ సూట్ లో ఈ అవార్డుల సెర్మనీకి హాజరైన అతడు.. ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు ఇచ్చినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు చెప్పాడు.
అటు డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా పద్మ భూషణ్ అందుకున్నాడు. ప్రతిష్టాత్మక అవార్డు తనకు ఇచ్చినందుకుగాను భారత ప్రభుత్వానికి అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. నటి శోభనకు కూడా పద్మ భూషణ్ పురస్కారం దక్కింది. ఇక సింగర్ అరిజిత్ సింగ్ కు పద్మశ్రీ అవార్డు అందించారు. 2025 ఏడాదికిగాను ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.
సంబంధిత కథనం