బాహుబలి.. ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా. తెలుగు సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లిన ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ.. ఈ ఏడాది అక్టోబర్ లో రీరిలీజ్ కానున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించాడు.
ఎస్ఎస్ రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలి మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. 2015లో రిలీజైన ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా రీరిలీజ్ ప్లాన్స్ గురించి తెలిపాడు. “అద్భుతానికి పదేళ్లు. ఈ ప్రత్యేకమైన రోజున ఈ బాహుబలి మూవీని ఈ ఏడాది అక్టోబర్ లో ఇండియాతోపాటు అంతర్జాతీయంగా రీరిలీజ్ చేయబోతున్నామని చెప్పడానికి చాలా థ్రిల్లింగా ఉంది.
ఇది కేవలం రీరిలీజ్ మాత్రమే కాదు. మా ప్రియమైన అభిమానులకు ఇది సంబరాల ఏడాది. కొన్ని సీక్రెట్స్ రివీల్ చేయడంతోపాటు కొన్ని సర్ప్రైజ్ లు కూడా ఉండబోతున్నాయి” అనే క్యాప్షన్ తో శోభు యార్లగడ్డ ఈ అప్డేట్ షేర్ చేశాడు. అక్టోబర్ లో ఏ రోజు అన్నది ఇంకా వెల్లడించలేదు. దీనిపై త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. బాహుబలి రీరిలీజ్ వార్త తెలియగానే ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు.
బాహుబలి మూవీ 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, తమన్నాలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకుపైగానే వసూలు చేసింది. రెండేళ్లకు అంటే 2017లో బాహుబలి 2 కూడా వచ్చింది. ఇది మెగా బ్లాక్బస్టర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1788 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలిగా అతని నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత అతడు తీసిన ప్రతిదీ పాన్ ఇండియా మూవీనే. బాహుబలి, భల్లాలదేవ, శివగామి, దేవసేన, మాహిష్మతిలాంటి పేర్లు ఈ సినిమా ద్వారా జనాల్లోకి బాగా వెళ్లాయి.
సంబంధిత కథనం