Pawan Kalyan Wishes To Padma Awards 2025 Balakrishna: తాజాగా 2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పలు కళల్లో విశేష సేవలు అందించినవారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 25న మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి.
పద్మ విభూషణ్ అవార్డ్కు ఏడుగురు, పద్మ భూషణ్కు 19 మంది, 113 మంది పద్మ శ్రీ పురస్కారాలను అందుకోనున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్య విభాగంలో పద్మ విభూషణ్ అవార్డ్ వరించగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి కళల కేటగిరీలో నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డ్స్ అందుకున్న వీరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
"ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ గారు పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన బాలకృష్ణ గారు, హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను" అని పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
"ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డా. డి. నాగేశ్వర్ రెడ్డి గారు పద్మ విభూషణ్కు ఎంపికైనందుకు అభినందనలు. ప్రజా ఉద్యమాల్లో శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఎం.ఆర్.పి.ఎస్. ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారు. శ్రీ మంద కృష్ణ మాదిగ గారు పద్మశ్రీ కు ఎంపికైనందుకు అభినందనలు" అని పవన్ కల్యాణ్ చెప్పారు.
"పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని, కవి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, సాహిత్యం-విద్య విభాగంలో ఎంపికైన శ్రీ కె.ఎల్. కృష్ణ గారు, శ్రీ వి.రాఘవేంద్రాచార్య పంచముఖి గారికి అభినందనలు.
మట్టిలో మాణిక్యాలాంటి వారికి పద్మ పురస్కారాలు అందిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం" అని పవన్ కల్యాణ్ అన్నారు.
"ఈ ఏడాది 30 మంది ఈ విధంగా ఎంపికైనవారు ఉండటం సంతోషాన్ని కలిగించింది. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు శ్రీ మిరియాల అప్పారావు గారికి మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారి కళా సేవకు తగిన గుర్తింపు దక్కింది" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్