టాలీవుడ్ రిట‌ర్న్ గిఫ్ట్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కౌంట‌ర్ - ఇక‌పై సినిమా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు బంద్ - థియేట‌ర్ల ఆదాయంపై ఆరా-ap deputy cm pawan kalyan warns to tollywood on theaters bandh call ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  టాలీవుడ్ రిట‌ర్న్ గిఫ్ట్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కౌంట‌ర్ - ఇక‌పై సినిమా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు బంద్ - థియేట‌ర్ల ఆదాయంపై ఆరా

టాలీవుడ్ రిట‌ర్న్ గిఫ్ట్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కౌంట‌ర్ - ఇక‌పై సినిమా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు బంద్ - థియేట‌ర్ల ఆదాయంపై ఆరా

Nelki Naresh HT Telugu

టాలీవుడ్ త‌న‌కు ఇచ్చిన రిట‌ర్న్ గిఫ్ట్‌కు ఏపీ డిప్యూటీ సీఏం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు శ‌నివారం ఏపీ డిప్యూటీ సీఏం కార్యాల‌యం ఓ అఫీషియ‌ల్ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసింది. ఇక నుంచి సినీ ప్ర‌తినిధుల‌తో ఎలాంటి వ్య‌క్తిగ‌త చ‌ర్చ‌ల‌కు తావు లేద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు

ప‌వ‌న్ క‌ళ్యాణ్

థియేట‌ర్ల బంద్ వ్య‌వ‌హారం టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు రిలీజ్ టైమ్‌లోనే థియేట‌ర్ల బంద్ వ్య‌వ‌హారం తెర‌పైకి కావ‌డంత ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. థియేట‌ర్ల బంద్ లేదంటూ ఫిలిం ఛాంబ‌ర్ శ‌నివారం ప్ర‌క‌టించింది. ప‌వ‌న్ సినిమాకు అడ్డంకులు సృష్టించాల‌నే థియేట‌ర్ల‌ను బంద్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టంతో ఈ వ్య‌వ‌హారంపై ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్ విచార‌ణ‌కు ఆదేశించారు.

ఈనేప‌థ్యంలో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్యాల‌యం రిలీజ్ చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌లో టాలీవుడ్ ఇచ్చిన రిట‌ర్న్ గిఫ్ట్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. థియేట‌ర్ల ఆదాయంపై ఆరాలు తీయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డ‌మే కాకుండా ఏపీలో ఎన్ని మ‌ల్టీప్లెక్స్‌లు, టికెల్ ధ‌ర‌ల‌పై ఓ నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ప్ర‌భుత్వ అధికారుల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశించిన‌ట్లు ఈ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఏపీలో...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేద‌ని ఈ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్క‌సారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు.

కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాల‌ని డిప్యూటీ సీఏం పవన్ కల్యాణ్ సూచించినా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సానుకూలంగా స్పందించ‌లేద‌ని ఈ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

గత ప్రభుత్వ ఛీత్కారాలు

తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి.

రూ.కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి.

క‌క్ష సాధింపులు...

గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు , పవన్ కల్యాణ్ చెప్పిన విధంగానే- కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు.

అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన హీరో సినిమా విడుదలైనప్పుడు సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం.

వ్య‌క్తిగ‌తంగా...

తెలుగు సినిమా రంగంవారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని గ‌తంలోనే డిప్యూటీ సీఏం పవన్ కల్యాణ్ సూచించారు. అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది.

రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కల్యాణ్ గారికి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని డిప్యూటీ సీఏం నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు.

థియేటర్ల ఆదాయంపై ఆరా…

డిప్యూటీ సీఏం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటి కే కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారు.

థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు.

టికెట్ ధ‌ర‌ల‌పై అంత‌రం...

రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైనా ఈ సందర్భంగా చర్చించారు. టికెట్ సేల్ కీ, వచ్చే పన్నుకీ అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారు.

ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో – సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం. వీటిపైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. ఈ మేరకు తూనికలు కొలతల అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించేలా సంబంధిత శాఖ మంత్రులు, అధికారుల‌తో త్వ‌ర‌లో చ‌ర్చ‌లు జ‌రుప‌బోతున్నారు.

మల్టీప్లెక్సులు ఎన్ని ఉన్నాయి?

రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండుమూడు స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్ లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీయ‌బోతున్న‌ట్లు శ‌నివారం రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం