Anurag Kashyap: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెలుసు కదా. ఈ మధ్య సౌత్ సినిమాలపై మనసు పారేసుకొని ముంబై వదిలి వచ్చేశాడు. అయితే కొద్ది రోజుల కిందట అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఎఫ్ఐఆర్లు వెల్లువెత్తడంతో అనురాగ్ ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. తన తప్పును గ్రహించానని, తన హుందాతనాన్ని మరచిపోకూడదని అన్నాడు.
ఓ వ్యక్తి చేసిన నీచమైన కామెంట్స్ చూసి తాను కూడా సహనం కోల్పోయి ఇలాంటి కామెంట్స్ చేసినట్లు అనురాగ్ వివరించాడు. తన ఎక్స్ అకౌంట్లో అతడు ఓ సుదీర్ఘ పోస్ట్ చేశాడు. “ఓ వ్యక్తికి సమాధానం ఇస్తూ కోపంలో నేను నా హద్దులు దాటాను. మొత్తం బ్రాహ్మణ సమాజం గురించి నేను తప్పుగా మాట్లాడాను.
ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంతో మంది ఇప్పటికే నా జీవితంలో ఉన్నారు. ఈరోజు వాళ్లందరూ బాధపడ్డారు. నా కుటుంబం కూడా బాధపడింది. నేను మాట్లాడిన విధానం చూసి నేను గౌరవించే ఎంతో మంది మేధావులు బాధపడ్డారు. అలాంటి విషయాలు మాట్లాడి నేను ఆ టాపిక్ నుంచి తప్పుదోవ పట్టాను. ఎవరో ఓ చీప్ కామెంట్ చేయడంతో నేను ఇలా అన్నాను తప్ప వాళ్లను అలా అనే ఉద్దేశం నాకు లేదు. వాళ్లందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు.
నా సహచరలు, నా కుటుంబం, మొత్తం బ్రాహ్మణ సమాజానికి నేను క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటాను. నా కోపాన్ని నియంత్రించుకుంటాను. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా.. సరైన పదాలనే వాడతాను. మీరు నన్ను క్షమిస్తానని ఆశిస్తున్నాను” అని అనురాగ్ అన్నాడు.
ఫూలే మూవీ విషయంలోనే ఈ రచ్చ జరిగింది. ఈ మూవీలోని కొన్ని సీన్లను సెన్సార్ బోర్డు కత్తిరించినట్లు తెలిసింది. దీనిపై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్పందించాడు. దఢక్ 2 మూవీ సమయంలో ఇండియాలో అసలు కుల వ్యవస్థ లేదని చెప్పిన సెన్సార్ బోర్డు.. ఇప్పుడు ఇలా చేయడమేంటని ప్రశ్నించాడు.
సంతోష్ మూవీ కూడా ఈ కారణంగానే ఇండియాలో రిలీజ్ కాలేదని అతడు అన్నాడు. 'ఇప్పుడు బ్రాహ్మణుడికి 'ఫూలే'తో సమస్య ఉంది. సోదరా, కుల వ్యవస్థ లేనప్పుడు బ్రాహ్మణుడు అంటే ఏమిటి? కుల వ్యవస్థ లేనప్పుడు జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయిలు ఎందుకు? అని గతంలో తన పోస్టులో అనురాగ్ రాసుకొచ్చాడు.
సంబంధిత కథనం