రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ స్పై యాక్షన్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మే ఆఖర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ తరుణంలో తాజాగా ఓ పోడ్కాస్ట్లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. షూటింగ్ ఫినిష్ అయ్యాక ఓ మూవీ రిలీజ్ వద్దనుకున్న విషయాన్ని వెల్లడించారు.
ట్యాక్సీవాలా సినిమా షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ వద్దని నిర్మాత అల్లు అరవింద్ అన్నారని విజయ్ దేవరకొండ తెలిపారు. ఆ తర్వాత ఏం చేశారో వివరించారు. ట్యాక్సీవాలా ఫైనల్ కట్ చూసి తనను ప్రొడ్యూజర్లు హైదరాబాద్కు పిలిచారని, చెన్నైలో ఉన్న తాను హుటాహుటిన వచ్చానని విజయ్ తెలిపారు. ఈ సినిమా వర్కౌట్ కాదని, తర్వాతి సినిమాను గ్రాండ్ రిలీజ్ చేద్దామని అల్లు అరవింద్ తనతో అన్నారని గుర్తు చేసుకున్నారు.
సినిమాను మళ్లీ చూద్దామని అల్లు అరవింద్ను ఒప్పించి చూశారట విజయ్ దేవరకొండ. కానీ అప్పుడు తనకు కూడా సినిమా చూసి నవ్వు రాలేదని చెప్పారు. సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సూటవలేదని తనకు అనిపించిందని విజయ్ చెప్పారు. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ను తీసుకొస్తానని అల్లు అరవింద్కు చెప్పి, జేక్స్ బెజోయ్ను కలిశానని తెలిపారు. జేక్స్ బెజోయ్ ఇచ్చిన మ్యూజిక్.. ట్యాక్సీవాలా మూవీకి బాగా సరిపోయి సక్సెస్కు కారణమైందని విజయ్ దేవరకొండ తెలిపారు.
టాక్సీవాలా సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. 2018 నవంబర్లో రిలీజైన ఈ సూపర్ నేచురల్ కామెడీ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకొని సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జావల్కర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం సుమారు రూ.7కోట్ల బడ్జెట్తో రూపొందగా.. రూ.40కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్ కొట్టింది. కమర్షియల్గా భారీ సక్సెస్ కొట్టింది. జీఏ2 పిక్చర్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై బన్నీవాసు, ఎస్కేఎన్, వంశీకృష్ణ ప్రమోద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.
భారీ అంచనాలు ఉన్న కింగ్డమ్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ మళ్లీ సక్సెస్ బాట పడతారని అభిమానులు ఆశిస్తున్నారు. మే 30న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదాతో ఆలస్యమై జూలై 4న రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
సంబంధిత కథనం