Allu Arjun Trolls: అల్లు అర్జున్ను దారుణంగా ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియా.. ఆ ఒక్కటి తప్ప అన్నీ మాట్లాడంటూ..
Allu Arjun Trolls: అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర ఓ అభిమాని మరణంపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేయడంపై బన్నీని ఆటాడుకుంటున్నారు.
Allu Arjun Trolls: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అభిమాని మరణంపై అల్లు అర్జున్ ఈ మధ్యే వీడియో రిలీజ్ చేసిన విషయం తెలుసు కదా. తనకు చాలా బాధగా ఉందంటూ.. రూ.25 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించాడు. అయితే సోషల్ మీడియా మాత్రం అతన్ని ట్రోల్ చేస్తూనే ఉంది. ఈ ఘటనపై అతడు కనీసం క్షమాపణ చెప్పలేదంటూ అల్లు అర్జున్ ను నిందిస్తున్నారు కొందరు అభిమానులు.
అల్లు అర్జున్ వీడియోపై సోషల్ మీడియా
పుష్ప 2 ప్రీమియర్ బుధవారం (డిసెంబర్ 4) రాత్రి అయిన విషయం తెలిసిందే. ఆ షో సంధ్య థియేటర్లో చూడటానికి అల్లు అర్జున్ రాగా.. ఫ్యాన్స్ ఎగబడటంతో రేవతి అనే ఓ అభిమాని చనిపోయింది. దీనిపై రెండు రోజుల తర్వాత స్పందించిన అల్లు అర్జున్.. ఓ వీడియో రిలీజ్ చేశాడు.
అయితే ఆ వీడియోలో ఎంతోసేపు మాట్లాడిన బన్నీ.. కనీసం క్షమాపణ చెప్పలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ఇప్పుడు ఎండగడుతోంది. ఏదేదో మాట్లాడు కానీ సారీ మాత్రం చెప్పవా అంటూ అతన్ని నిలదీస్తోంది. సానుభూతి ప్రకటించడం వరకూ ఓకే కానీ.. క్షమాపణ చెప్పకపోవడం తనను షాక్ కు గురి చేసిందని ఓ యూజర్ కామెంట్ చేశారు.
ఘటన జరిగిన 48 గంటల తర్వాత స్పందించడం, అది కూడా మూవీని ప్రమోట్ చేసే హుడీ, మేకప్, లైటింగ్ అంతా సెట్ చేసుకొని రావడం, చివరికి క్షమాపణ కూడా చెప్పకపోవడం ఏంటని మరో యూజర్ నిలదీశారు.
బాగానే ఎంజాయ్ చేశారు కదా..
ఈ వీడియోలో అసలు మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేయాలని అనిపించలేదని, తమ టీమ్ అంతా బాధగా ఉందని కూడా అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఈ పాయింట్ ను ఓ యూజర్ లేవనెత్తుతూ.. కేక్ కట్ చేశారు.. బాణసంచా కాల్చారు.. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదని చెబుతారంటూ ప్రశ్నించారు.
ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసే ముందు కాస్త ఆలోచించు అంటూ క్లాస్ పీకారు. "ఏమో రా బాబు నీ సినిమాను లేపి రియల్ లైఫ్ లో నిన్ను తిట్టాలి అంటే మనసు రాట్లేదు" అని మరొకరు కామెంట్ చేశారు. మరీ రూ.25 లక్షలు అనేది చాలా తక్కువ మొత్తం అని, అందులోనూ సారీ కూడా చెప్పలేదని ఇంకో యూజర్ అన్నారు. రికార్డులు తాత్కాలికం.. క్యారెక్టర్ శాశ్వతం.. ఘటన జరిగిన వెంటనే ఎందుకు స్పందించలేదు.. కేసు పెట్టిన తర్వాతగానీ నీ టీమ్ ను హాస్పిటల్ కు పంపించలేదు.. అసలు నీకు అభిమానులంటే లెక్క లేదు అని మరో యూజర్ క్లాస్ పీకడం గమనార్హం.
అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అతన్ని వెనకేసుకొస్తున్నారు. అతడు పెద్ద మనసు చాటుకున్నాడని అంటున్నారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ 3 నిమిషాల 47 సెకన్ల వీడియో రిలీజ్ చేసినా.. అందులో ఒక్కచోట కూడా ఈ ఘటన జరిగినందుకు క్షమించమని మాత్రం అడగలేదు. దీనినే చాలా మంది సోషల్ మీడియా యూజర్లు తప్పుబడుతున్నారు. హీరోలకు మీరంటే లెక్కలేదు.. పిచ్చి అభిమానం మానుకోండంటూ అటు ఫ్యాన్స్ కు కూడా కొందరు సూచిస్తున్నారు.