నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్లో రాబోతున్న అఖండ 2 మూవీ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చేసింది. 2021లో వచ్చిన అఖండ మూవీకి ఇది సీక్వెల్కాగా.. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలూ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో.. అఖండ 2పై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అఖండ 2 మూవీ రిలీజ్ డేట్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్రయూనిట్ బుధవారం ప్రొమోను విడుదల చేసింది. ముహూర్తపు సన్నివేశం తీసిన రోజు బాలయ్య చెప్పిన ‘ఉగ్రభూతాలు ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదురా ఈశ్వరుడిది... పరమేశ్వరుడిది. కాదని తాకితే జరిగేది తాండవం.. అఖండ తాండవం’ డైలాగ్ను ఈ ప్రొమోకి జతచేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబరు 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రొమోలో చూపించారు.
ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్న ఈ అఖండ 2 మూవీలో నందమూరి బాలకృష్ణకి జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై గోపీ అచంట, రామ్ అచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అఖండ సినిమాకి బ్లాక్బాస్టర్ సాంగ్స్తో పాటు బీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇచ్చిన తమన్.. అఖండ 2కి కూడా పనిచేయబోతున్నారు. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో ఇప్పటి వరకు సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లని రాబట్టి.. బాలయ్య కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మరీ ముఖ్యంగా.. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు తర్వాత ఆ రేంజ్లో మాస్ ప్రేక్షకుల్ని మళ్లీ బాలయ్యకి ఈ సినిమాలు చేరువ చేశాయి. దాంతో అఖండ 2 కూడా అంతకుమించి అనేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది.