Aishwaryaa Rajinikanth Gold Stolen: రజనీకాంత్ కూతురి ఇంట్లో భారీ బంగారం చోరీ.. ఎంత విలువ అంటే?
Aishwaryaa Rajinikanth Gold Stolen: రజనీకాంత్ కూతురి ఇంట్లో భారీ బంగారం చోరీ జరిగింది. ఐశ్వర్య రజనీకాంత్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Aishwaryaa Rajinikanth Gold Stolen: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో బంగారం చోరీ జరిగింది. తన లాకర్ నుంచి సుమారు 60 సవర్ల బంగారం, డైమండ్ నగలు ఎవరో ఎత్తుకెళ్లారని ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీటి విలువ సుమారు రూ.3.6 లక్షలు ఉంటుందని, వాటిని తన సోదరి సౌందర్య పెళ్లికి వాడినట్లు ఆమె చెప్పింది.
పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ బంగారం, నగలను ఐశ్వర్య ఓ లాకర్లో ఉంచిందని, ఈ విషయంలో ఇంట్లో పని చేసే వాళ్లు కొందరికి తెలుసు. ఐశ్యర్య ఫిర్యాదు మేరకు టేనంపేట్ పోలీసులు సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు. ఐశ్వర్య ఈ చోరీ వెనుక ఇంట్లో పని వాళ్లు, డ్రైవర్ పై అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె లాల్ సలామ్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉంటూ వివిధ నగరాల్లో తిరుగుతోంది.
నిజానికి గత ఫిబ్రవరి నెలలో ఈ బంగారం, నగలు పోయినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటిని తాను చివరిసారి 2019లోనే తన సోదరి సౌందర్య పెళ్లి సమయంలోనే చూశానని చెప్పింది. పెళ్లి తర్వాత వాటిని లాకర్ లో ఉంచినట్లు తన ఫిర్యాదులో తెలిపింది. అయితే 2021లో ఈ లాకర్ ను మూడు వేర్వేరు ప్రదేశాలకు తరలించినట్లు కూడా వెల్లడించింది.
గతేడాది ఏప్రిల్ లో ఈ లాకర్ తన పోయెస్ గార్డెన్ ఇంటికి చేరిందని, అయితే దీని కీస్ మాత్రం సెయింట్ మేరీస్ రోడ్ లోని తన ఫ్లాట్ లో ఉన్నట్లు కూడా ఐశ్వర్య చెప్పింది. గత ఫిబ్రవరి 10న తాను లాకర్ ఓపెన్ చేసి చూడగా.. అందులో బంగారం, నగలు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొంది. తన పెళ్లి నుంచి ఈ 18 ఏళ్లలో తాను ఈ నగలను కూడబెట్టుకున్నట్లు చెప్పింది. డైమండ్ సెట్లు, గోల్డ్ ముక్కలు, నవరత్నం సెట్లు, గాజులు, సుమారు 60 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు తెలిపింది.
తన ఫిర్యాదులో ఆమె అనుమానితుల పేర్లు కూడా వెల్లడించింది. తన పని వాళ్లు ఈశ్వరి, లక్ష్మితోపాటు డ్రైవర్ వెంకట్ పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ ముగ్గురే సెయింట్ మేరీస్ లోని తన ఫ్లాట్ కు తరచూ వెళ్లి వచ్చేవారని చెప్పింది.
టాపిక్