Aishwarya Lekshmi Interview: మట్టి కుస్తీ ఓ పైసా వసూల్ మూవీ.. నా పాత్ర సవాలుతో కూడుకున్నది: ఐశ్వర్య లక్ష్మి
Aishwarya Lekshmi Interview: మట్టి కుస్తీ ఓ పైసా వసూల్ మూవీ అని, ఇందులో తన పాత్ర సవాలుతో కూడుకున్నదని నటి ఐశ్వర్య లక్ష్మి చెప్పింది. హీరో విష్ణు విశాల్ నటించిన ఈ మూవీ వచ్చే శుక్రవారం (డిసెంబర్ 2) రిలీజ్ కాబోతోంది.
Aishwarya Lekshmi Interview: మరో స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మట్టికుస్తీ పేరుతో వస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించారు. రవితేజ, విష్ణు విశాల్ కలిసి నిర్మించారు. వచ్చే శుక్రవారం (డిసెంబర్ 2)న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ హీరోయిన్ ఐశ్వర్య మీడియాతో మాట్లాడింది.
నిజానికి ఈ కథను తాను మూడేళ్ల ముందు విన్నానని, తాను చేయగలనో లేదో అన్న అనుమానంతో అప్పుడు పక్కన పెట్టినట్లు ఆమె చెప్పింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ఆ కథ మళ్లీ తన దగ్గరికే రావడం, ఈ గ్యాప్లో చేసిన సినిమాలతో కాన్ఫిడెన్స్ రావడంతో అంగీకరించినట్లు తెలిపింది. తన పాత్ర సవాలుతో కూడుకున్నదని, ఫిజికల్గా డిమాండ్ చేస్తుందని ఆమె వెల్లడించింది.
మట్టి కుస్తీ మూవీ పక్కాగా పైసా వసూల్ మూవీ అని స్పష్టం చేసింది. ఎమోషనల్ పాత్రలు తనకు అలవాటే అని, అయితే ఈ మూవీలో తాను కామెడీ కూడా తొలిసారి ప్రయత్నించినట్లు ఐశ్వర్య చెప్పడం విశేషం. ఈ మూవీ ఒక ఫ్యామిలీ డ్రామా అని, ఆడ, మగ అందరూ సమానమే అని ఎంతో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఆమె తెలిపింది.
ఇక హీరో విష్ణు విశాల్ గురించి మాట్లాడుతూ.. అతడు చాలా హార్డ్ వర్కర్ అని, ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచీ అసలు నిద్ర పోలేదని చెప్పడం విశేషం. ప్రస్తుతం చాలా ఇండస్ట్రీలు టాలీవుడ్ను ఫాలో అవుతున్నాయని, తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తారని అభిప్రాయపడింది. తెలుగులో తనకు సాయి పల్లవి, సత్యదేవ్లతో పరిచయం ఉందని, తాను కూడా తెలుగు సినిమాలు చూస్తానని చెప్పింది.