Varalaxmi on Negative Reviews: నెగిటివ్ రివ్యూస్పై వరలక్ష్మీ ఫైర్.. ఆపాలని స్పష్టం
Varalaxmi on Negative Reviews: ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నెగిటివ్ రివ్యూ రాసేవారిపై విరుచుకుపడింది. ఇలాంటి రివ్యూస్ సినిమా ఇమేజ్ను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది. ఆమె నటించిన కొండ్రాల్ పావమ్ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఈ విధంగా స్పందించారు.
Varalaxmi on Negative Reviews: ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేక్షకాదరణ బట్టే సినిమా భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మూవీలో విషయం ఉండాలే కానీ మౌత్ టాక్తో సంచలన విజయాలు అందుకుంటాయి. ఇప్పటికే పలుచిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. అయితే ఇది అన్ని సార్లు కుదురుతుందనడానికి లేదు. ప్రస్తుతం చాలా వరకు రివ్యూసే సినిమాల ఫలితాన్ని నిర్ణయిస్తున్నాయి. చిన్న సినిమాలు సైతం బాగుంటే రివ్యూస్ వాటికి బాగా ఉపకరిస్తున్నాయి. బాగోలేదంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే నిర్మోహమాటంగా రిజల్ట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ విషయంలో చాలా మంది సెలబ్రెటీలు బహిరంగంగానే తమ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నెగిటివ్ రివ్యూలపై ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించారు. రివ్యూలు చెప్పడం మానుకోవాలని స్పష్టం చేసింది.
వరలక్ష్మీ నటించిన కోలీవుడ్ చిత్రం కోండ్రాల్ పావమ్ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు నుంచి నెగిటివ్ రివ్యూస్ను అందుకుంది. దీంతో విమర్శకులపై తనదైన శైలిలో వరలక్ష్మీ ఫైర్ అయింది. ఇలాంటి రివ్యూస్ సినిమా ఇమేజ్ను దెబ్బతీస్తాయని మండిపడింది.
"కొత్త సినిమాలు విడుదలైన వెంటనే కొంతమంది సోషల్ మీడియాలో అదే పనిగా రివ్యూలు రాస్తుంటారు. చాలా విషయాలను ఎత్తిచూపుతూ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఏది మంచిదో, ఏది కాదో చెబుతుంటారు. ఇలాంటివి ఆగాలి. ఎందుకంటే అవి సినిమా ఇమేజ్ను దెబ్బతీస్తాయి" అని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపింది.
వరలక్ష్మీ నటించిన తాజా చిత్రం కొండ్రాల్ పావం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కన్నడలో సూపర్ హిట్గా నిలిచిన ఆ కరళా రాత్రి సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఇది అంతకుముందు తెలుగులో అనగనగా ఓ అతిథి అనే పేరుతో ప్రక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో చైతన్య కృష్ణ, పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో నటించారు.