Rashmika Mandanna Trolled : అయ్యో.. మళ్లీ రష్మికను ట్రోల్ చేసిన కన్నడిగులు
Trolls On Rashmika Mandanna : రష్మిక మందనపై కన్నడిగులు మరోసారి ట్రోల్స్ మెుదలుపెట్టారు. కాంతార సినిమా ఇంకా చూడలేదని రష్మిక మందన చేసిన కామెంట్స్ నుంచి ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా రష్మిక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ విషయంపైనా మండిపడ్డారు నెటిజన్లు.
ఆదివారం ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శాండల్వుడ్ స్టార్స్ యష్(Yash), సుదీప్, ఉపేంద్ర, దర్శన్ సహా పలువురు ప్రముఖులు తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నటి రష్మిక మందన(Rashmika Mandanna) కూడా అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపింది. ఎప్పుడూ ట్రోల్ కు గురయ్యే.. రష్మిక మాత్రం పండగకు విషెస్ చెప్పినా ట్రోల్ అయిపోయింది.
గోధుమ రంగు కుర్తా ధరించి, నమస్కరిస్తున్న ఫోటోను రష్మిక క్లిక్ చేసి తన సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసింది. అలాగే కొన్ని భాషల్లో సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసింది. ముందుగా కన్నడలో సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసి.. అనంతరం తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, ఆంగ్ల భాషల్లో పండుగ శుభాకాంక్షలు చెప్పింది. కొందరు రష్మికకు తిరిగి విష్ చేయగా, మరికొందరు ఆమెను ట్రోల్ చేయడం మెుదలెట్టారు.
'మొదట కన్నడ(Kannada)లో రాసినంత మాత్రాన నీకు కన్నడంటే ఇష్టమని చెప్పలేం. కన్నడతో అకస్మాత్తుగా ఎలా ప్రేమలో పడ్డారు? మీరు ఇంతకు ముందు చేసిన వాటిని మేం ఎప్పటికీ మరచిపోం. మేం ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా కన్నడిగులలాగే ఉంటాం. మీ ఈ నకిలీ కన్నడ ప్రేమ మాకు వద్దు. కనీసం ఇప్పుడు అయినా కన్నడ ప్రాముఖ్యత తెలుసా?' అని ఆమెపై నెటిజన్లు ఫైర్ అయ్యారు... ట్రోల్స్ చేస్తున్నారు.
రష్మిక మందన(Rashmika Mandanna) సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 'కిరిక్ పార్టీ'(kirik party) సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం 30 డిసెంబర్ 2016న విడుదలైంది. 'కిరిక్ పార్టీ' తెరపైకి వచ్చి 6 సంవత్సరాలు అయింది. పరమవ స్టూడియోస్, పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్పై జిఎస్ గుప్తా, రక్షిత్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటలకు అజనీష్ బి లోక్నాథ్ అందించారు. 4 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 50 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. రక్షిత్ శెట్టి, రష్మిక మందన, సంయుక్త హెగ్డే, అచ్యుత్ కుమార్, చందన్ ఆచార్, ప్రమోద్ శెట్టి తదితరులు నటించారు.
మొదటి సినిమాకి ఇప్పటికి రష్మిక స్టేటస్ చాలా మారిపోయింది. 'కిరిక్ పార్టీ'లో సాన్వి పాత్ర నుండి 'మిషన్ మజ్ను'(Mission Majnu)లో నస్రీన్ వరకు, రష్మిక విభిన్న పాత్రలతో, చాలా మంది స్టార్ నటుల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముంబై, హైదరాబాద్లో ఫ్లాట్స్ కొన్నట్టుగా తెలుస్తోంది. డబ్బు, పేరుతో పాటు రష్మిక వివాదాల్లో చిక్కుకుంది. కన్నడను మరిచి తను ఎక్కిన నిచ్చెనను కాలితో తన్నిందని రష్మికపై ఆరోపణలు వచ్చాయి. రక్షిత్ శెట్టికి దూరం కావడంలాంటి విషయాలపైనా కొంతమంది కన్నడిగులు ఫైర్ అవుతుంటారు.