ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తోంది. లయ నటిగా రీ ఎంట్రీ ఇస్తోన్న తమ్ముడి సినిమాలో ఆమెతోపాటు వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వాసిక విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 11న తమ్ముడు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా తమ్ముడు ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నటి లయ మాట్లాడుతూ.. "నేను సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకుని 20 ఏళ్లవుతోంది. తమ్ముడు మూవీతో తిరిగి నా నట ప్రయాణం మొదలుపెట్టాను. సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతోంది. బ్రేక్ తర్వాత ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు సందేహాలు, భయాలు ఉండేవి. ఈ సినిమా టీమ్ నాలో ఆ భయాన్ని పోగొట్టి నమ్మకాన్ని కలిగించారు" అని అన్నారు.
"శ్రీరామ్ వేణు గారు నాతో 2 రోజులు ఫొటోషూట్ చేయించి ఈ మూవీకి తీసుకున్నారు. అలాగే ఎంతోమంది ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తున్న దిల్ రాజు గారి బ్యానర్తో నేను తిరిగి చిత్ర పరిశ్రమకు రావడం హ్యాపీగా ఉంది. మా ఆన్ స్క్రీన్ తమ్ముడు నితిన్తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది" అని హీరోయిన్ లయ తెలిపారు.
"నేను తిరిగి ఇండస్ట్రీకి వచ్చానంటే అందుకు నా భర్త, పిల్లల సహకారం ఎంతో ఉంది. నేను ఇప్పటిదాకా చేయాలనుకున్న పాత్రలు, సినిమాలు చేసే అవకాశం మరోసారి టాలీవుడ్ కల్పించింది. తమ్ముడు సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మా అందరిలో ఉంది" అని నటి లయ చెప్పుకొచ్చారు.
ఇదే ఈవెంట్లో తమ్ముడు ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ.. "దిల్ రాజు గారి బ్యానర్లో అద్భుతమైన చిత్రాలకు పనిచేసే అవకాశం లభించింది. తమ్ముడు చిత్రాన్ని శ్రీరామ్ వేణు గారు చాలా కొత్తగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. హీరో నితిన్, ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తమ్ముడు సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని కోరారు.
"శ్రీరామ్ వేణుతో ఎంసీఏ, వకీల్ సాబ్ మూవీస్కు వర్క్ చేశాను. తమ్ముడు మూవీ ఒక సర్ప్రైజింగ్ ఫిల్మ్. శ్రీరామ్ వేణు ఒక సర్ప్రైజింగ్ సబ్జెక్ట్ను మీకు చూపించబోతున్నాడు. తమ్ముడు ట్రైలర్ మీకు నచ్చిందని భావిస్తున్నా. తమ్ముడు సినిమా ప్రేక్షకులందరికీ రీచ్ కావాలి" అని సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం