నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఈ ప్రముఖ నటుడు ఈ రోజు తెల్లవారుజామున పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. హాసన్ తమిళంలో ప్రమాణ స్వీకారం చేయగా, తోటి పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు.
కమల్ హాసన్ రాజ్యసభలోకి ప్రవేశించడం ఆయన రాజకీయ జీవితంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది. ఆయన తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 2024 లోక్సభ ఎన్నికలలో మక్కల్ నీది మయ్యం మద్దతుకు బదులుగా ఎగువ సభలో ఆయనకు సీటు హామీ ఇచ్చిన అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమి మద్దతుతో ఆయనకు ఈ నామినేషన్ వచ్చింది.
రాజకీయ నాయకుడుగా మారిన 69 ఏళ్ల నటుడు కమల్ హాసన్ పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. "నేను చాలా గర్వంగా, గౌరవంగా భావిస్తున్నాను" అని అన్నారు. జూన్ 6న తమిళనాడు సచివాలయంలో కమల్ హాసన్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, విసికెకు చెందిన తోల్. తిరుమావళవన్, ఎండిఎంకెకు చెందిన వైకో, తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై వంటి కూటమి భాగస్వాముల సీనియర్ నాయకులతో కలిసి ఆయన హాజరయ్యారు.
234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో రాజ్యసభ సీటు గెలవడానికి అభ్యర్థికి కనీసం 34 ఓట్లు అవసరం. డీఎంకె నేతృత్వంలోని ఇండియా బ్లాక్ (డీఎంకె-133, కాంగ్రెస్-17, విసికె-4, సిపిఐ-2, సిపిఎం-2) నుంచి 158 మంది ఎమ్మెల్యేలతో.. ఎగువ సభలో నాలుగు స్థానాలను గెలుచుకోవడానికి ఈ కూటమికి బలం ఉంది. జూన్ 12న కమల్ హాసన్, మరో ఐదుగురు తమిళనాడు నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నై సచివాలయంలో రిటర్నింగ్ అధికారి సుబ్రమణి ఎన్నికల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఎన్నికైన ఇతర సభ్యులలో డీఎంకేకు చెందిన కవి సల్మా (ఎ రొక్కయ్య మాలిక్), ఎస్సార్ శివలింగం, పి విల్సన్ (రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు), ఏఐఏడీఎంకే కు చెందిన చెందిన ఐఎస్ ఇంబాదురై, ధనపాల్ ఉన్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఇతర ఎంపీలు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ 2.62% ఓట్లను సాధించింది కానీ ఏ సీట్లను గెలుచుకోలేకపోయింది. కమల్ చివరిగా ‘థగ్ లైఫ్’ సినిమా చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
సంబంధిత కథనం