BJP MuralidharRao: దారుస్సలాం స్వాధీనం చేసుకుంటామన్న మురళీధర్ రావు
BJP MuralidharRao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టేనని బిజెపి మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళీధర్ రావు ఆరోపించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని, బిజెపి వస్తే దారుస్సలాం స్వాధీనం చేసుకుంటామన్నారు.
BJP MuralidharRao: తెలంగాణలో రజాకార్ల హెడ్ క్వార్టర్ గా దారుసలాం పని చేస్తోందని మురళీధర్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆస్తి దారుసలాంను 1969లో సల్లాఉద్దీన్ ఓవైసీకి ఆ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు. ప్రజల ఆస్తి అయిన దారుసలాంను మజ్లీస్ కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, మతతత్వ రాజకీయాలు నడుపుకునెందుకు దరుసలాంను ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ట్రెండింగ్ వార్తలు
నిజాం, కాశీం రిజ్వీ వారసత్వ రాజకీయాలు నడుపుకునేందుకు కార్యాలయం, భద్రత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. అది దేశ వ్యతిరేక చర్య కాదా అని నిలదీశారు. అమరవీరుల స్థూపం వద్ద రాహుల్ గాంధీ క్షమాపణ ఎందుకు కోరలేదన్నారు.
నిజాం, కాంగ్రెస్ చేసిన ద్రోహాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని, బిఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని దొంగలించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందని, కాంగ్రెస్ గెలిస్తే బీఅర్ఎస్ గెలిచినట్టేనన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వారిలో 21మందిని బీఆర్ఎస్ పోటీకి నిలబెట్టి వారికి డబ్బులు ఇస్తుందన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, మజ్లిస్, కాంగ్రెస్, బీఅర్ఎస్ లక్ష్యం బీజేపీని ఓడించడమన్నారు. ఈ మూడు పార్టీల ఉనికిని బీజేపీ ప్రశ్నిస్తుందని చెప్పారు.
బీజేపీ అధికారంలోకి వస్తె మజ్లిస్ కు ఇచ్చిన తెలంగాణ ఆస్తులను న్యాయపరంగా స్వాధీనం చేసుకుంటామన్నారు. నూతన వ్యవసాయక విప్లవాన్ని తీసుకువచ్చినట్లు బీఅర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.
రైతాంగానికి కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు వెయ్యి రూపాయలు బోనస్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొందని, ప్రజలు, రైతుల వద్దకు ఈ అంశాన్ని తీసుకెల్టామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాల కన్నా ఇది విలువైందని చెప్పారు. ఉత్పత్తి, దిగుబడికీ బోనస్ ఇవ్వడం ద్వారా కౌలు రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.
సరికొత్త హరిత విప్లవాన్ని తీసుకువచ్చే విధంగా బీజేపీ ఎన్నికల ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. నూనె గింజలు, పప్పు దినుసులు, చిరు ధాన్యాల్లో ఆత్మ నిర్భరత రావాలని, సాగు చేసే రైతుకు నష్టం రాకూడదన్నారు. మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మార్క్ ఫెడ్ బలహీన పడిందన్నారు.
డబుల్ ఇంజన్ సర్కారు వస్తే తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, గ్రామాల్లో ఆవులు లేకపోవడం వల్ల రసాయనిక ఎరువుల వినియోగం పెరుగుతుందన్నారు. రసాయనిక ఎరువుల వల్ల నీరు కలుషితమై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, గ్రామీణ ఆర్థిక, వ్యవసాయ పెరుగుదలలో ఆవు చాలా ముఖ్యమన్నారు. రైతులకు ఉచితంగా ఆవును ఇస్తామన్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు.
టాపిక్