Lok Sabha election results 2024 : లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు! ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. అధికార ఎన్డీఏకి విపక్ష ఇండియా కూటమి మంచి పోటీ ఇస్తోంది.
2014, 2019 ఎన్నికల్లో విపక్షాలు తేలిపోయాయి. బీజేపీ- ఎన్డీఏ సంచలన గెలుపును చూశాయి. అయితే.. 2024 లోక్సభ ఎన్నికల విషయానికొస్తే.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. విపక్ష ఇండియా కూటమి ఊహించిన దాని కన్నా మెరుగైన ప్రదర్శనే చేసేలా కనిపిస్తోంది!
ఉదయం 10:30 గంటలకు 543 సీట్లల్లో ఎన్డీఏ కూటమి 284 సీట్లల్లో మెజారిటీలో ఉంది. మెజారిటీ మార్క్ 272 కన్నా కాస్త ఎక్కువే. కానీ.. అందరిని షాక్కు గురిచేస్తూ.. ఇండియా కూటమి 210 చోట్ల లీడింగ్లో ఉంది.
Congress Lok Sabha election results : ఇండియా కూటమిలో ఒక్క కాంగ్రెస్ పార్టీనే 94 సీట్లల్లో లీడింగ్లో ఉంది. 2014లో ఈ పార్టీ 44 సీట్లు దక్కించుకుంది. 2019లో 52 సీట్లతో సరిపెట్టుకుంది. కానీ ప్రస్తుత ట్రెండ్స్ని చూస్తుంటే.. నాటి ఘోర పరాభవం నుంచి కాంగ్రెస్ కోలుకున్నట్టు కనిపిస్తోంది. ఈసారి నెంబర్లు పెరగడం ఖాయంగా ఉందని సమచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. కేరళ వయనాడ్తో పాటు యూపీ రాయ్బరేలీలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం.. ఆయన రెండు సీట్లల్లోనీ భారీ లీడింగ్లో ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం.. వారణాసిలో మోదీకి కనిపిస్తున్న మెజారిటీ కన్నా.. రాయ్బరేలీలో రాహుల్ గాంధీకి ఆధిక్యం ఎక్కువగా ఉంది.
కాంగ్రెస్తో పాటు డీఎంకే, ఎస్పీ జోరు కొనసాగిస్తుండటంతో మొత్తం మీద ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఇదే కొనసాగితే.. అధికార ఎన్డీఏకి పలు చోట్ల షాక్ తప్పకపోవచ్చు.
Lok Sabha election results India : దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్.. ఏన్డీఏ ఏకపక్ష విజయం తప్పదని అంచనా వేశాయి. విపక్షాలు తేలిపోతాయని అన్నాయి. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాజా ట్రెండ్స్ని చూస్తుంటే.. విపక్ష ఇండియా కూటమికి మెజారిటీ దక్కకపోయినా.. నెంబర్లు మాత్రం మెరుగ్గా ఉండనున్నాయి.
సంబంధిత కథనం