KCR : ఈ ప్రభుత్వాన్ని బీజేపీ వదిలిపెడుతుందా? 20 మంది ఎమ్మెల్యేలతో వస్తానంటే వద్దని చెప్పా..! కేసీఆర్ కీలక వ్యాఖ్యలు-kcr made key comments on congress govt and bjp party during the parliamentary elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kcr : ఈ ప్రభుత్వాన్ని బీజేపీ వదిలిపెడుతుందా? 20 మంది ఎమ్మెల్యేలతో వస్తానంటే వద్దని చెప్పా..! కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR : ఈ ప్రభుత్వాన్ని బీజేపీ వదిలిపెడుతుందా? 20 మంది ఎమ్మెల్యేలతో వస్తానంటే వద్దని చెప్పా..! కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

BRS Party Latest News: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారు కొందరు బాధపడుతున్నారని.. ఓ సీనియర్ నేత తనని సంప్రదించారని పార్టీ నేతలతో చెప్పారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR Comments On Congress Govt : పార్లమెంట్ ఎన్నికలకు(Loksabha Polls 2024) సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR). ఇప్పటికే అన్నిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన… ప్రచారంపై కూడా దృష్టిపెట్టారు. అయితే ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న పార్లమెంట్ ఎన్నికల విస్తృతస్థాయి స‌మావేశం జరిగింది. పార్టీ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేశారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

తెలంగాణలోని కాంగ్రెస్(TS Congress Govt) ప్రభుత్వం మనుగడ సాధించటం కష్టమే అనిపిస్తోందని కేసీఆర్ అభిప్రాయపడ్డారని తెలిసింది. “నాడు బీఆర్ఎస్ పార్టీకి వంద మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగానే… సర్కార్ ను పడగొట్టేందుకు బీజేపీ యత్నించింది. అలాంటిది మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా 64 మంది ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా..?” అని నేతలతో అన్నట్లు సమాచారం.

ఇక ఇదే సమావేశంలో పార్టీ మారుతున్న వారి విషయంలో కూడా సంచలన విషయాలను బయటపెట్టారు కేసీఆర్. కాంగ్రెస్ లోకి వెళ్లినవారు బాధపడుతున్నారని… అక్కడ పరిస్థితి ఏం బాగాలేదని చెప్పారని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. అంతేకాకుండా కాంగ్రెస్ లోని ఓ సీనియర్ నాయకుడు తనని సంప్రదించారని కేసీఆర్ చెప్పటం ఇప్పుడు అతిపెద్ద సంచలనంగా మారింది. బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని సదరు సీనియర్ నేత చెప్పినట్లు కేసీఆర్ నేతలతో అన్నారట..! “ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని నన్ను సంప్రదించాడు, కానీ ఇప్పుడే వద్దని చెప్పాను” అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది.

ఇక ఎన్నికలపై మాట్లాడుతూ… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలవబోతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.గట్టిగా పోరాడితే మరో మూడు స్థానాలను కూడా కైవసం చేసుకోవచని అన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయం గంద‌ర‌గోళం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని కూడా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజులు మనవేనంటూ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారని కూడా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కవిత అరెస్ట్ తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని కూడా కేసీఆర్ నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.

KCR Bus Yatra: కేసీఆర్ బస్సుయాత్ర…..

ఇప్పటికే పలు సభలను నిర్వహించింది బీఆర్ఎస్. పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కేసీఆర్ బస్సు యాత్ర(KCR Bus Yatra)కు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా బీఆర్ఎస్ నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఎండి పంట పొలాలను పరిశీలించటంతో పాటు రోఢ్ షోలలో కూడా పాల్గొనున్నారు. ఉదయం 11 వరకు పొలం బాట చేపట్టాలని యోచిస్తున్నారు. సాయంత్రం నుంచి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో  రెండు మూడు చోట్ల రోడ్డు షోలు తలపెట్టాలని చూస్తున్నారు. మరోవైపు సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.