Politicians Panchangam : ఉగాది పండుగను(Ugadi 2024)రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. క్రోధి నామ సంవత్సరంలో తమకు అన్ని శుభాలే జరగాలని భగవంతుని వేడుకుంటున్నారు. దీంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. అన్ని ఆలయాలు పంచాంగ పఠనలతో సందడిగా మారాయి. ఎన్నికల ఏడాది కావడంతో అన్ని ప్రధాన పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం ఆసక్తికరంగా మారింది. అన్ని ప్రధాన పార్టీ కార్యాలయాల్లో జరిగిన అయ్యగార్ల పంచాంగాన్ని ఒకసారి చూసేద్దాం.
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో (Ugadi Celebrations)చిలుకూరి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరుశురాముడులా పనిచేస్తారని ఆయన జోస్యం చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిందని.......ఇది శుభ పరిణామం అన్నారు. రేవంత్ రెడ్డి గత అక్టోబర్ నుంచి సింహంలా పనిచేశారని, క్రోధి నామ సంవత్సరంలో కూడా అంతే మంచే జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతిపక్షాలు మరింత బలహీన పడతాయన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi)కూడా రాజయోగం ఉందని, ప్రధానమంత్రి పదవిలో మార్పులు సంభవిస్తాయన్నారు. ఈ ఏడాది మంత్రులు మరణాలతో పాటు పత్రికా యాజమాన్యం అనారోగ్యంతో చనిపోతారని చెప్పారు. రాజకీయనేతలు కూడా ఈ ఏడాది జైలు శిక్షలకు అర్హులు అవుతారని వెల్లడించారు.
మరో వైపు తెలంగాణ భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో కేటీఆర్ (KTR)తో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. రాబోయే ఎన్నికల్లో పాలక పక్షాలకు కష్టాలు తప్పవని..... ప్రతిపక్షంగా ఉన్నవారు ప్రయత్నం చేస్తే దిగ్విజయాన్ని పొందవచ్చు అని వేద పండితులు పేర్కొన్నారు. కేసీఆర్ (KCR)(కర్కాటకం) రాశిలో అత్యంత సంతోషకరంగా ఆదాయ వ్యవహారాలు కనిపిస్తున్నాయని తెలిపారు. వారి మాటకు గమనానికి అడ్డు ఉండదని..... ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహన ప్రమాద (Road Accidents)అవకాశాలు ఉన్నాయి గనుక ఎక్కువ ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక కేటీఆర్ రాశిలో ఆదాయ వ్యాయాయాలు సమానమని....రాజపూజ్యం, ప్రజాబలం బాగుందన్నారు. అవమానాలు తక్కువ ఉన్నాయని కాకపోతే కేటీఆర్ మాటలు కాస్త కట్టడి చేసుకోవాలని లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు.
ఇక బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)తో పాటు పార్టీ ముఖ్య నాయకులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేద పండితుల పంచాంగ శ్రవణం(Panchangam Shravanam) వినిపించారు. పార్టీలో అంతర్గత కొట్లాటలు ఉంటాయని అధినాయకత్వం జోక్యం వల్ల వారంతా తిరిగి ఒక్కటిగా ఏర్పడి.....సమిష్టి విజయం సాధిస్తారని చెప్పారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం మరి కొన్నేళ్లు కొనసాగుతుందన్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) దుమారం రేపుతున్న వేల.... రెండేళ్ల క్రితం నాటి పంచాంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media)వైరల్ అవుతుంది. ఆనాటి ఉగాది వేడుకల్లో పండితులు సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపిస్తూ......నరసింహుడికి త్రినేత్రం ఉన్నట్లుగానే కేసీఆర్(KCR Trinetram) కూడా మూడో నేత్రం ఉందన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో? ఎవరిని కలుస్తున్నారో? ఎవరితో మాట్లాడుతున్నారో? అనే విషయాలను కేసీఆర్ తన త్రినేత్రంతో గ్రహిస్తారని ఆయన రెండేళ్ల క్రితం జోస్యం చెప్పారు. అయన చెప్పినట్టుగానే కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ప్రతిపక్ష నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు సీక్రెట్ గా విన్నారని ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పండితులు సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పింది నిజమేనని కేసీఆర్ మూడో నేత్రం ఫోన్ ట్యాపింగ్ అని పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం