BRS Loksabha Candidates 2024: పార్లమెంట్ ఎన్నికలకు(Loksabha Elections 2024) సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ(BRS Party). ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… తాజాగా మరో రెండు స్థానాలకు క్యాండెంట్లను ఖరారు చేసింది. ఇందులో కీలకమైన మెదక్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రాంరెడ్డిని ఖరారు చేసింది. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇచ్చింది.
కీలకమైన మెదక్ స్థానం నుంచి ఊహించని విధంగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేరును ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిజానికి ఈ స్థానం నుంచి కేసీఆరే పోటీ చేస్తారన్న టాక్ వినిపించింది. ఆయన కాకపోతే…. ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అవకాశం దక్కొచ్చన్న వార్తలు వినిపించాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో…. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే ఈ సీటును ప్రకటిస్తామని బీఆర్ఎస్ చెప్పింది. కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డిని ఖరారు చేయటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఊహించిన విధంగానే ఇటీవలే పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు…. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ దక్కింది. బీఎస్పీకి రాజీనామా చేసి…. ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్నారు ఆర్ఎస్పీ.
రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు బీఆర్ఎస్…. 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో కీలకమైన నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ్నుంచి పలువురు నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో…. ఈ స్థానాల నుంచి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.