Adilabad Congress : వారు వద్దే వద్దు....! ప్రత్యర్థుల చేరికలకు అడ్డుపడుతున్న 'హస్తం' నేతలు-adilabad congress politics is taking twists and turns day by day with joinings of leaders ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Adilabad Congress : వారు వద్దే వద్దు....! ప్రత్యర్థుల చేరికలకు అడ్డుపడుతున్న 'హస్తం' నేతలు

Adilabad Congress : వారు వద్దే వద్దు....! ప్రత్యర్థుల చేరికలకు అడ్డుపడుతున్న 'హస్తం' నేతలు

HT Telugu Desk HT Telugu

Loksabha Elections 2024 : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జెండా ఎగరవేయాలని భావిస్తుండగా.. పక్క పార్టీల నేతలను చేర్చుకునే విషయంలో మాత్రం తర్జనభర్జన పడుతోంది.

ఆదిలాబాద్ కాంగ్రెస్ రాజకీయం

Adilabad Congress : లోక్ సభ ఎన్నికలు(Loksabha Elections 2024) సమీపిస్తున్న వేళ ఆదిలాబాద్ కాంగ్రెస్ రాజకీయాలు రోజుకోవిధంగా మలుపులు తిరుగుతూ అధిష్టానానికి తలనొప్పి తెప్పిస్తున్నాయి. సిట్టింగ్ బీజేపీ సీటుపై ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్న ఆ పార్టీకి స్థానిక నేతల గ్రూపు రాజకీయాలు కలవరపెట్టిస్తున్నాయి. 

ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ (Adilabad Lok Sabha constituency)పరిధిలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటును గెలుచుకుంది. లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీనివ్వాలంటే ఆదిలాబాద్ జిల్లాలో సరైన నాయకత్వ లేమి, సంస్థాగతంగా పార్టీ బలం పుంజుకోకపోవడంతో ఇన్చార్జి బాధ్యతలను మంత్రి సీతక్కకు అధిష్టానం కట్టబెట్టింది. గెలుపు ఓటములపై ప్రభావం చూపే ఆదివాసులు, గిరిజనేతరుల ఓట్ల మద్దతును కూడగట్టుకునేందుకు ఇతర పార్టీల నుండి బలమైన నేతలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రూపొందించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ ఆ పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, నిర్మల్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి(IndraKaran Reddy) కాంగ్రెస్లో చేరడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు తూర్పు జిల్లాలో బలమైన నాయకుడిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంచిర్యాల మాజీ శాసన సభ్యుడు గడ్డం అరవింద రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి, అరవింద రెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని రాజ్యసభ సభ్యుడు కె.కేశవ్ రావు, మాజీ మంత్రి జానారెడ్డితోనూ మంతనాలు సాగించారు. కారు పార్టీ వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం లాంచనమేనని ప్రచారం జరగ్గా వారిని చేర్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేసేది లేదని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అక్కడి ఇన్చార్జి శ్రీహరి రావు తేల్చి చెప్పారు.

నిరసనలు, రిలే దీక్షలు, పార్టీ కి రాజీనామాలు :

ఇంద్రకరణ్ రెడ్డి రాకను అడ్డుకుంటూ లక్ష్మణ్ చాందా మండలంలో నిరసన దీక్షలు కూడా కొనసాగాయి. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ ను గతంలో ఘాటుగా విమర్శిస్తే ఇప్పుడు ఎలా పార్టీలో చేర్చుకుంటారని, ఎన్నికల్లో ఎలా కలిసి వెళుతామని శ్రీహరిరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు, పార్టీ పెద్దల సమక్షంలో కుండబద్దలు కొట్టినట్లు సమాచారం.

మంచిర్యాల జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు ఇటీవల సిద్ధమయ్యారు. పెద్దపల్లి పార్లమెంటు బరిలో పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా అరవింద రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు గడ్డం వివేక్, వినోద్ ఎమ్మెల్యేలు ఇద్దరూ స్వాగతించినా ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అడ్డుపడినట్లు తెలిసింది. గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో తన బద్ధశత్రువైన అరవింద రెడ్డిని చేర్చుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఢిల్లీ హైకమాండ్ పెద్దలకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ మారకుండా జెండామోస్తున్న తనకు తన పక్కన ప్రత్యర్థులకు అవకాశం ఇస్తే సహించేది లేదని, అరవింద రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పితే తాను పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు వలసలపై ఘాటుగా స్పందించడంతో లోక్సభ ఎన్నికల వేళ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని భావించి అధిష్టానం ఎన్నికల తర్వాతే చేరికలు సంగతి చూసుకుందామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్లో మారుతున్న గ్రూపు రాజకీయాలు, అస మ్మతి, నిరసన గళాలు అధిష్టానానికి తలనొప్పిగా పరిణమిస్తున్నాయి.

రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.