Maharashtra Elections 2024: మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ హోరాహోరీ.. సీట్ల పంపకాలపై కసరత్తు-mahayuti maha vikas aghadi race to announce seat sharing with a month left for maharashtra polls ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Maharashtra Elections 2024: మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ హోరాహోరీ.. సీట్ల పంపకాలపై కసరత్తు

Maharashtra Elections 2024: మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ హోరాహోరీ.. సీట్ల పంపకాలపై కసరత్తు

HT Telugu Desk HT Telugu

Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉండటంతో అధికార మహాకూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీలు తమ సీట్ల పంపకాలను ప్రకటించేందుకు ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశాయి.

శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ థాకరేను కలిసిన కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల (HT_PRINT)

ముంబై, అక్టోబర్ 20: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉండటంతో అధికార మహాకూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీలు సీట్ల పంపకాలను ప్రకటించే దిశగా ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశాయి. సీట్ల పంపకాలపై చర్చ తుది దశలో ఉందని బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ‘నిన్న సానుకూల చర్చతో సమస్యాత్మక స్థానాలను క్లియర్ చేశాం. మిగిలిన కొన్ని సీట్లను మరో రెండు రోజుల్లో క్లియర్ చేస్తాం..’ అని అన్నారు. ‘బీజేపీ ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డు ఆమోదం వంటి ప్రక్రియలు దాదాపుగా ముగిశాయి. మా మొదటి జాబితా ఎప్పుడైనా రావచ్చు' అని ఆయన అన్నారు.

శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైనట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు. ‘మహాకూటమి సీట్ల పంపకాలపై సానుకూలంగా చర్చలు జరిగాయి. చర్చలు చివరి దశలో ఉన్నాయి. సీట్ల పంపకాలు త్వరలోనే ఖరారవుతాయి. మీకు శుభవార్త చెబుతాం’ అని చెప్పారు.

ఫార్ములా ఇదే

భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) మధ్య చర్చల తరువాత, సీట్ల పంపకం దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లకు సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసినట్లు వారు తెలిపారు. ఏక్ నాథ్ షిండే వర్గం నేతృత్వంలోని పార్టీ 85-90 స్థానాల్లో పోటీ చేస్తుందని, పవార్ కు 50 సీట్లు వస్తాయని, మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే అధికార కూటమి తన పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుచుకుందని బీజేపీ నేత ఒకరు తెలిపారు.

‘లోక్ సభ ఎన్నికల సమయంలో రాజ్యాంగ మార్పుపై ప్రతిపక్షాలు చేసిన తప్పుడు కథనాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి. హర్యానా ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికల్లో మనకు చాలా ఎడ్జ్ ఇవ్వబోతున్నాయి. రిజర్వేషన్ల డిమాండ్ పరిష్కారానికి చర్యలు తీసుకున్నందున మరాఠా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటు వేస్తారు..’ అని సదరు నేత చెప్పారు.

ప్రతిపక్షాల కసరత్తు ఇదీ

మహా వికాస్ అఘాడీ భాగస్వామ్య పక్షాల మధ్య అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం సమావేశాలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఇంచార్జీ రమేష్ చెన్నితల శనివారం తెలిపారు.

సీట్ల పంపకాల సమావేశాలు నిరంతరం జరుగుతున్నాయని, త్వరలోనే ప్రకటిస్తామని ఆయన విలేకరులతో చెప్పారు. శివసేన(యూబీటీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై గతంలో జరిగిన చర్చల్లో కొన్ని తర్జనభర్జనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రేను సంజయ్ రౌత్ నియంత్రిస్తున్నారంటే అది తమ సమస్య కాదని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు.

‘ఉద్ధవ్ ఠాక్రేను సంజయ్ రౌత్ నియంత్రిస్తున్నారంటే అది వారి సమస్య. మా నాయకులకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. మేము ఆ పని చేస్తున్నాము. సంజయ్ రౌత్ ఏం చేస్తారనే దానిపై తాము ఏమీ మాట్లాడదల్చుకోలేదన్నారు. ‘సీట్ల పంపకాల కమిటీలో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు లేరు. అయితే ఈ నేతల ఆదేశాల మేరకే కమిటీని ఏర్పాటు చేశాం..’ అని చెప్పారు.

రమేష్ చెన్నితల శనివారం శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. 'ఈ రోజు ఉద్ధవ్ ఠాక్రేను కలిశాను. ఆయన ఇటీవల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి వెళ్లాను. 'వో అబ్ ఠీక్ హై ఔర్ మహా వికాస్ అఘాడీ కా భీ తబేయత్ ఠీక్ హై' అని చెన్నితాల మీడియాతో అన్నారు.

పటోలే, రౌత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పారదర్శకత కనిపించడం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మహాయుతి ప్రభుత్వం అసలు వ్యక్తుల పేర్లను ఎన్నికల నుంచి తొలగిస్తోందని, బోగస్ ఓటర్లను చేర్చుకుంటోందని సంజయ్ రౌత్ అన్నారు. ఎన్నికల సంఘానికి లేఖ రాశామని... ఎన్నికల్లో ఎలాంటి పారదర్శకత కనిపించడం లేదని పటోలే విలేకరులతో అన్నారు.

ఓటరు జాబితా తారుమారుపై ఎంవీఏ ప్రతినిధి బృందం మహారాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి సమాచారం అందించిందని ఆయన చెప్పారు. బోగస్ ఓటర్లను చేర్చుకునేందుకు అధికార కూటమి ప్రయత్నిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. (ఏఎన్ఐ)