AAP Manifesto : ఆప్ ‘ఆల్రౌండర్’ మేనిఫెస్టో- మహిళలకు డబ్బులు, విద్యార్థులకు మెట్రో రాయితీ, వృద్ధులకు..
AAP manifesto 2025 : ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో భాగంగా 15 హామీలను ప్రకటించారు. ఉచిత నీరు, రోడ్ల విస్తరణతో సహా గత టర్మ్లో నెరవేర్చని మూడు హామీలను సైతం ఈసారి మేనిఫెస్టోలో చేర్చారు. ఆ వివరాలు..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై ‘హామీల’ వర్షం కురిపించారు మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఈ మేరకు ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేశారు.

ఆప్ మేనిఫెస్టోలోని 15 హమీలు..
1- దేశ రాజధానిలో 100 శాతం ఉపాధిని సాధించడం. నిరుద్యోగ సమస్య పరిష్కారం.
2. 'మహిళా సమ్మాన్ యోజన'లో మహిళలకు నెలకు రూ.2,100
3. సంజీవని యోజనలో సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం.
4. తప్పుగా పెంచిన నీటి బిల్లులను మాఫీ చేయండి
5- 24×7 పరిశుభ్రమైన తాగునీరు
6- యమునా నది శుభ్రం చేయడం
7- యూరోపియన్ ప్రమాణాలతో దిల్లీ రోడ్లను రిపేర్ చేయడం
8. దళిత విద్యార్థులకు డాక్టర్ అంబేడ్కర్ స్కాలర్షిప్ యోజన
9 - ఉచిత బస్సు ప్రయాణం. దిల్లీ మెట్రోలో కళాశాల, పాఠశాల విద్యార్థులకు 50శాతం రాయితీ
10 - హిందూ, సిక్కు పూజారులకు రూ .18,000.
11. కౌలుదారులకు ఉచిత విద్యుత్, నీరు.
12. కొత్త ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లోనే మురుగునీటి పారుదల లైన్ల మరమ్మతులు. మూసుకుపోయిన వాటిని బాగు చేయడం
13 - పౌరులకు రేషన్ కార్డు
14 - ఆటోరిక్షా, ఈ రిక్షా డ్రైవర్లకు వారి కుమార్తె వివాహానికి రూ.లక్ష ఆర్థిక సహాయం. పిల్లలకు ఉచిత కోచింగ్. రూ.10 లక్షల జీవిత బీమా. 5 లక్షల ఆరోగ్య బీమా.
15 – ప్రైవేటు భద్రత కోసం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లకు డబ్బులు.
అంతేకాదు, గత టర్మ్లో పార్టీ పూర్తి చేయలేకపోయిన మూడు హామీలను సైతం ఈసారి నెరవేరుస్తామని కేజ్రీవాల్ చెప్పారు. 24 గంటలూ ఉచిత నీరు, యమునా ప్రక్షాళన, దిల్లీలో యూరోపియన్ తరహా రోడ్లు వంటి హామీలు మిగిలిపోయాయంటూ వాటిని తాజా మేనిఫెస్టోలో చేర్చారు.
ప్రజలు ఓట్లేస్తారా?
70 సీట్లున్న దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. అంతకు ముందు 1998 నుంచి 2013 వరకు అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాగా ఈసారి కేజ్రీవాల్ టీమ్కి బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా కృషిచేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కి ఓటు వేస్తూ దిల్లీ ప్రజలు మరి ఈసారి ఎవరిని గెలిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం