Delhi election results : దిల్లీ ఎన్నికల్లో బీజేపీ హవా- ఆప్ పరిస్థితి ఇలా..
Delhi election results live : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్ కాస్త వెనకపడింది. ఈ రెండింటికీ కాంగ్రెస్ చాలా దూరంలో ఉంది! లేటెస్ట్ అప్డేట్స్ ఇలా..
దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం! శనివారం ఉదయం 8 గంటలకు దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఆప్ మాత్రం వెనకపడింది.
దిల్లీ ఎన్నికల ఫలితాలు- ఎర్లీ ట్రెండ్స్..
దిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్ 36గా ఉంది. ఇక ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు ఉన్న డేటా ప్రకారం.. బీజేపీ 32 చోట్ల ముందంజలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 14 చోట్ల లీడింగ్లో ఉంది.
మొదట్లో ఖాతా తెరవని కాంగ్రెస్.. ఇప్పుడు 1 చోట లీడింగ్లో ఉంది.
అంతేకాదు, ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ ముందంజలో ఉన్నారు.
దిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కట్టుదిట్ట భద్రత మధ్య కౌంటింగ్..
ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక 8న కౌంటింగ్ కోసం ఈసీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కోసం దిల్లీ వ్యాప్తంగా 19 కేంద్రాలను సిద్ధం చేసింది. 10వేలకుపైగా మంది పోలీసులు, ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద రెండు పాలమిలిటరీ దళాలు విధులు నిర్వహిస్తున్నాయి.
దిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ఆలిస్ వాజ్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కోసం శనివారం మొత్తం 5,000 మంది సిబ్బందిని, లెక్కింపు పర్యవేక్షకులు, లెక్కింపు సహాయకులు, మైక్రో పరిశీలకులను, ఈ ప్రక్రియకు శిక్షణ పొందిన సహాయక సిబ్బందిని మోహరించిన్నట్లు తెలిపారు.
2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా..
2020లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 70 సీట్లల్లో 62 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని తిరిగి కైవశం చేసుకుంది. బీజేపీ 8 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ మాత్రం అసలు ఖాతానే తెరవలేదు. 2015 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు.
ఈసారి పరిస్థితులు మారుతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి! దేశ రాజధానిలో 26ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని అనేక ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
పీ-మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 39-49, ఆప్కి 21-31, కాంగ్రెస్కి 0-1 సీట్లు వస్తాయని తేలింది.
బీజేపీకి 35-40 సీట్లు, ఆప్కి 32-37 సీట్లు, కాంగ్రెస్కి ఒక సీటు వస్తాయని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 51-60 సీట్లు, ఆప్కి 10-19 సీట్లు, కాంగ్రెస్కి 0 సీట్లు వస్తాయని తెలిపింది. పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 40-44 సీట్లు, ఆప్ కు 25-29 సీట్లు, కాంగ్రెస్ కు 0-1 సీట్లు వస్తాయని తేలింది.
సంబంధిత కథనం