Arvind Kejriwal : నిన్నటి వరకు ప్రధాని అభ్యర్థి- ఇవాళ ఎమ్మెల్యే కూడా కాదు.. కేజ్రీవాల్​ ఖేల్​ ఖతం!-delhi election results arvind kejriwal loses new delhi big setback for aap ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Arvind Kejriwal : నిన్నటి వరకు ప్రధాని అభ్యర్థి- ఇవాళ ఎమ్మెల్యే కూడా కాదు.. కేజ్రీవాల్​ ఖేల్​ ఖతం!

Arvind Kejriwal : నిన్నటి వరకు ప్రధాని అభ్యర్థి- ఇవాళ ఎమ్మెల్యే కూడా కాదు.. కేజ్రీవాల్​ ఖేల్​ ఖతం!

Sharath Chitturi HT Telugu
Updated Feb 08, 2025 01:47 PM IST

Arvind Kejriwal defeat : అరవింద్​ కేజ్రీవాల్​కి బిగ్​ షాక్​! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​ అధినేత ఓటమి అంచున నిలబడ్డారు. న్యూ దిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేష్​ గెలుపువైపు దూసుకెళుతున్నారు.

అరవింద్​ కేజ్రీవాల్​ ఓటమి..
అరవింద్​ కేజ్రీవాల్​ ఓటమి.. (ANI Pic Service)

దేశ రాజకీయాల్లో కీలక మలుపు! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్​ కేజ్రీవాల్​ ఓటమి అంచున నిలబడ్డారు! తన న్యూ దిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వే వర్మ చేతుల్లో దాదాపు 4వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్​ ఓటమిని చూడొచ్చు.

నిన్న మొన్నటి వరకు విపక్షాల ‘పీఎం అభ్యర్థి’ రేసులో ముందు వరుసలో ఉన్న అరవింద్​ కేజ్రీవాల్​కి.. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడం గమనార్హం.

మొదటి నుంచి వెనుకంజలోనే..!

70 సీట్లున్న దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. న్యూ దిల్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా అరవింద్​ కేజ్రీవాల్​ వెనుకంజలోనే ఉన్నారు. ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పర్వేష్​ సాహిబ్​ వర్మ.. కేజ్రీవాల్​పై ఆధిపత్యాన్ని చెలాయించారు.

కౌంటింగ్​ మొదలైన గంటన్నర తర్వాత కేజ్రీవాల్​ తొలిసారి ఆధిక్యంలోకి వచ్చారు. అది కూడా చాలా స్వల్ప ఆధిక్యంలో కనిపించారు. కొంతసేపటికే మళ్లీ వెనుకంజలోకి వెళ్లిపోయారు.

చివరికి, న్యూదిల్లీ నియోజకవర్గం 14 రౌండ్ల కౌటింగ్​లో 13వ రౌండు ముగిసే సమయానికి అరవింద్​ కేజ్రీవాల్​ 4099 ఓట్ల తేడాతో వెనకంజలో ఉన్నారు.

ఈ క్రమంలోనే న్యూదిల్లీ నియోజకవర్గంలో తాను కేజ్రీవాల్​ని ఓడించినట్టు పర్వేష్​ వర్మ ప్రకటించారు.

అటు ఆమ్​ ఆద్మీ పార్టీకి కూడా 2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పీడకలగానే మిగిలిపోతాయి! ఎన్నికల సంఘం డేటా ప్రకారం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ఆప్​ 3 చోట్ల విజయం సాధించి, మరో 19 చోట్ల లీడింగ్​లో ఉంది. మొత్తం మీద ఆప్​కి 22 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటు బీజేపీ 48 చోట్ల గెలవొచ్చు.

మరీ ముఖ్యంగా కేజ్రీవాల్​తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్​ శిశోడియా కూడా తన జంగ్​పురా నియోజకవర్గంలో ఓడిపోయారు. దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో భాగంగా వీరిద్దరు జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.

కేజ్రీవాల్​కి తీవ్ర భంగపాటు..!

ఒక సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి 3సార్లు దిల్లీ సీఎం పదవి చేపట్టారు అరవింద్​ కేజ్రీవాల్​. కానీ గత ఏడాది కాలంగా ఆయన చుట్టూ ఎన్నో రాజకీయ వివాదాలు కనిపించాయి. మరీ ముఖ్యంగా దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు ఆప్​ని, కేజ్రీవాల్​ని వెంటాడింది. ఇదే కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చారు. వచ్చిన వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. “ప్రజలే తనని గెలిపిస్తారు. ప్రజలు గెలిపించిన తర్వాతే, తిరిగి సీఎం బాధ్యతలు చేపడతాను,” అంటూ గతేడాది తన ముఖ్యమంత్రి పదవిని ఆప్​ కీలక నేత అతిషికి అప్పగించారు.

దిల్లీ లిక్కర్​ స్కామ్​తో పాటు కేజ్రీవాల్​ అధికార నివాసం చుట్టూ కూడా వివాదం నెలకొంది. ఆడిట్ నివేదికలో రూ.96 లక్షల విలువైన మెయిన్, షీర్ కర్టెన్లు, రూ.39 లక్షల విలువైన కిచెన్ ఎక్విప్​మెంట్, రూ.4.80 లక్షల విలువైన మినీబార్, రూ.16.27 లక్షల విలువైన సిల్క్ కార్పెట్లు కనిపించాయి. దీనిని బీజేపీ తన ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్​ అవన్నీ కొనుక్కున్నారని కమలదళం ఆరోపించింది. 

2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల రూపంలో కేజ్రీవాల్​కి మరో ఘోర భంగపాటు తప్పలేదు. పార్టీ నాయకుడే గెలవకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా, ప్రధానమంత్రికి గట్టిపోటీనిచ్చే విపక్ష నేతల్లో కేజ్రీవాల్​ ఒకరిని ఇంతకాలం అందరు భావించేవారు. కానీ తాజా ఓటమితో ఆప్​ అధినేత రాజకీయ జీవితం తారుమారైంది. ప్రధాని కుర్చీ కాదు కదా, కానీసం దిల్లీ అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.

Whats_app_banner

సంబంధిత కథనం