SC On Pinnelli: కౌంటింగ్ కేంద్రంలోకి రావొద్దని పిన్నెల్లికి సుప్రీంకోర్టు ఆంక్షలు, పోస్టల్ బ్యాలెట్లపై జోక్యానికి నో..
SC On Pinnelli: ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లో ఈవిఎంను ధ్వంసం చేసిన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించొద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
SC On Pinnelli: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిన్నెలి రామకృష్ణ రెడ్డి కి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇచ్చిన రక్షణపై టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టులో జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
పిన్నెల్లికి ఇచ్చిన సడలింపులను పరిశీలించిన న్యాయస్థానం ఇది న్యాయాన్ని అవహేళన చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ న్యాయవాది ఆదినారాయణ, జవ్వాజి శరత్లు వాదనలు వినిపిస్తూ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన వెబ్ కాస్టింగ్ వీడియోలను ధర్మాసనానికి ప్రదర్శించారు.
వాటిని చూసి న్యాయమూర్తులు రామకృష్ణా రెడ్డి కి సంభందించిన న్యాయవాదిని దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తానేమీ అనదలుచుకోలేదని చెప్పడతో కోర్టు ఉత్తర్వులను వెలువరించింది.
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కౌంటింగ్ కేంద్రం పరిసరాలలోకి రాకూడదని ఆ విధంగా ఒప్పుకుంటున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొనీ మాత్రమే హైకోర్టు తగిన ఉత్తర్వులు వెలువరించాలని పేర్కొంది.
పోస్టల్ బ్యాలెట్లపై ఎదురు దెబ్బ…
పోస్టల్ బ్యాలెట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను సుప్రీంలో సవాల్ చేసిన వైసీపీకి చుక్కెదురైంది. వైసీపీ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు ఈ వ్యవహారంలో తమ వాదన విన్నాకే నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు కేవీయట్ దాఖలు చేవారు. తప్పులు ఉన్నాయనుకుంటే ఎన్నికల తర్వాత పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించిందని, - కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసిందని గుర్తించారు. దీంతో డివిజన్ బెంచ్ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీకి అక్కడ కూడా నిరాశ తప్పలేదు.
పోస్టల్ బ్యాలెట్ కి సంభందించి ఎలెక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు కోర్టు కొట్టి వేసింది. హైకోర్టు ఉత్తర్వలపై ఈ రోజు సుప్రీం కోర్టు జస్టిస్ అరవింద్ కుమార్ మరియు సందీప్ మెహతా ల తో కూడిన ధర్మాసనం విచారణ చెబట్టింది. వైకాపా తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులో జోక్యానికి నిరాకరించి పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించారు.
సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు ….డీజీపీ హరీష్ గుప్తా
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. కౌంటింగ్ తర్వాత అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారని, కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిజిపి హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. అలాంటి పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామనీ, వారిని కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
అలాంటి పోస్టులను, ఫోటోలను , వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధమని, గ్రూప్ అడ్మిన్ లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని సూచించారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.
సంబంధిత కథనం