Election Counting Security: ఏపీలో గద్దెనెక్కేదెవరో తేలేది రేపే, వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం..-security will be tightened at the offices of ycp and tdp in ap ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Election Counting Security: ఏపీలో గద్దెనెక్కేదెవరో తేలేది రేపే, వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం..

Election Counting Security: ఏపీలో గద్దెనెక్కేదెవరో తేలేది రేపే, వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం..

HT Telugu Desk HT Telugu

Election Counting Security: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు మంగళవారం రానున్నాయి. రేపు మద్యాహ్నానికి దాదాపుగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.‌ గద్దెనెక్కేవారు ఎవరో తేలిపోతుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా వైసీపీ, టీడీపీ రాష్ట్ర కార్యాలయాల వద్ద భద్రతను భారీగా పెంచారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై భారీగా అంచనాలు

Election Counting Security: రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. అప్పటి నుంచి గెలుపోటములపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జూన్ 1 సాయంత్రం విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ తో చర్చలు మరింత విస్తృతంగా సాగుతున్నాయి. అయితే రేపు (మంగళవారం) ఓట్ల లెక్కింపుతో ఎవరు గెలుస్తారో అనే చర్చలకు అడ్డుకట్ట పడి, ప్రభుత్వ ఏర్పాటు, కొత్త మంత్రివర్గంపై చర్చలు సాగుతాయి.

వైసీపీ గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు, కొత్త మంత్రి వర్గంపై పెద్దగా చర్చలు ఉండవు. ఎందుకంటే వైసీపీ ఇప్పటికే జూన్ 9న విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించింది. స్వయానా జగన్మోహన్ రెడ్డే, ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.

అలాగే మంత్రివర్గం ఏర్పాటుపై కూడా పెద్దగా చర్చలు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న మంత్రివర్గంలో స్వల్ప మార్పులు ఉంటే ఉంటాయి. అదీ కూడా ఇప్పుడు మంత్రి వర్గంలో ఉన్నవారు ఎవరైనా ఓటమి చెందితే, వారి స్థానంలో‌ కొత్తవారికి అవకాశం రావచ్చు. అంతేతప్ప పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

అదే టీడీపీ కూటమి‌ గెలిస్తే మాత్రం సుదీర్ఘ చర్చలకు దారి తీయవచ్చు. ఎందుకంటే వైసీపీలో జగన్ నిర్ణయమే ఫైనల్, అదే కూటమిలో చంద్రబాబు నిర్ణయం ఫైనల్ కాదు. కూటమికి సంబంధించిన ఏ చిన్న నిర్ణయమైన పవన్ కళ్యాణ్, బీజేపీతో చర్చించే చంద్రబాబు తీసుకోవాలి.

కూటమి గెలిస్తే జూన్ 9న చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే దీన్ని కూటమి అధికారికంగా ధృవీకరించలేదు. దీనిపై టీడీపీ అగ్రనేతలుగానీ, జనసేన, బీజేపీ నేతలుగానీ ప్రకటించలేదు. అలాగే కూటమి గెలిస్తే మంత్రి వర్గంపై కూడా టీడీపీ, జనసేన,‌ బీజేపీ కలిసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

రేపు ఓట్ల లెక్కింపు... ఫలితాలు వెల్లడి

175 ఎమ్మెల్యే, 25 ఎంపి స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. తుది ఫలితాలు వెల్లడికి మాత్రం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య వెలువడతాయని ఎన్నికల సంఘం తెలిపింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 111అసెంబ్లీ స్థానాల తుది ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడి అవుతాయి.

ఈ 111 స్థానాల్లో ఒక్కోస్థానం ఓట్లను 20 రౌండ్లు లెక్కిస్తారు. 61 స్థానాలకు సాయంత్రం 4 గంటల లోపు తుది ఫలితాలు వెల్లడవుతాయి. ఈ 61 స్థానాల్లో ఒక్క స్థానం ఓట్లను 21 నుంచి 24 రౌండ్లు లెక్కిస్తారు. మిగతా మూడు స్థానాల ఫలితాలు సాయంత్రం ఆరు గంటల్లో వెల్లడవుతాయి. ఈ మూడు స్థానాల్లో ఒక్కోస్థానం ఓట్లను 25కు పైగా రౌండ్లలో లెక్కిస్తారు.

రాష్ట్రంలో 144 సెక్షన్

ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదని పోలీస్ వ్యవస్థ పేర్కొంది. అలాగే సమస్యాత్మక మాచర్ల తదితర ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేశారు. అలాగే ఇప్పటికీ అన్ని పెట్రోల్ బంక్ ల్లో వాటర్ బాటిల్స్ ‌లో పెట్రోల్ నింపకూడదని జిల్లా కలెక్టర్లు పెట్రోల్ బంక్ లకు ఆదేశాలు ఇచ్చారు.

తాడేపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద, ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కూడా పోలీసులు భద్రత పెంచారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ప్రధాన కార్యాలయాలకు భారీ భద్రత కల్పించారు. రేపు (మంగళవారం) ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటువంటి హింస, దాడులకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు. టీడీపీ, వైసీపీ కార్యాలయాల్లో పోలీసులు భధ్రతా ఏర్పాట్లు చేశారు.‌

(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

సంబంధిత కథనం