- సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో వాటాలు, కీలక స్థానాలకు బదిలీ కోరుకునే అధికారులనుంచి వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాలు, గిరిజన గ్రామాలకు రహదారుల పనులు, ఇతర కాంట్రాక్టులు చేస్తున్న వారి నుంచి పని ఆధారంగా కమీషన్లు వసూలు చేస్తారనే ప్రచారం ఉంది.
- బూర్జ, సీతంపేట మండలాల సరిహద్దులో 30 ఎకరాల గిరిజనుల భూములు బినామీల పేరిట కొనుగోలు చేసి ఫాం హౌస్ నిర్మించారు.
నియోజకవర్గంలో సమస్యలు:
- పాలకొండ మండలం పాలకొండ నగరపంచాయితీకి శాశ్వత డంపింగ్ యార్డు లేదు. టీడీపారాపురం గ్రామం వద్ద అయిదు ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు గతంలో కేటాయించారు. గ్రామానికి సమీపంలో ఉండడంతో డంపింగ్ యార్డు ఏర్పాటును గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. దీంతో పాలకొండ శివారున తాత్కాలిక డంపింగ్ యార్డులోనే చెత్తను వేస్తున్నారు. దీంతో సమీపంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- నగరపంచాయతీలో అన్ని ప్రాంతాలకు రక్షిత తాగునీరు అందడం లేదు. నాలుగు పథకాలు ఉన్నా ఎం.ఎం.నగర్, నవోదయ నగర్, గారమ్మకాలనీ, శ్రీనివాసానగర్లకు పూర్తిగా తాగునీటి పైపులు లేవు. కేంద్ర ప్రభుత్వం నాన్ అమృత్ పథకం రూ.57 కోట్లుతో మంజూరు చేసినా రెండు నెలలు పనులు చేసి నిలిపివేశారు.
- తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పూర్తికాలేదు. కేవలం రబీలోనే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం పనులైనా పూర్తికాకపోవడంతో వీరఘట్టం, పాలకొండ, బూర్జ మండలాల పరిధిలోని 30 వేల ఎకరాలకు ఏటా సాగునీటి సమస్య ఎదురవుతోంది.
- జంపరకోట రిజర్వాయరు నిర్మాణం ఏళ్లుగా పూర్తికాలేదు. దీంతో ఆ ప్రాంతంలోని పొలాలకు సాగునీరు ప్రశ్నార్థకం అవుతోంది. 1987 లో తెదేపా హయాంలో ప్రాజెక్టును రూ.2.5 కోట్లతో ప్రారంభించారు. అనంతరంజలయజ్ఞంలో పనులు కొనసాగించారు. తర్వాత నిర్వాసితులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు గ్రామాల పరిధిలో 2,100 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
- పాలకొండలోని అగ్నిమాపక కార్యాలయ భవనం పూర్తిగా శిథిలమైంది. ఇందులోనే పదేళ్లుగా కార్యాలయం కొనసాగుతోంది. భవనం నిర్వహణకు అనువుగా లేదంటూ ఆర్అండ్్బ అధికారులు 15 ఏళ్ల కిందటే తేల్చారు. నిధులు మంజూరవుతున్నా కొత్త భవన నిర్మాణ పనులు మాత్రం సాగడంలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డులో కేంద్రం కొనసాగుతోంది.
- పాలకొండ డివిజన్ కేంద్రంలోని ప్రాంతీయ పశువైద్య కేంద్రం భవనం నాలుగు నెలల కిందట కూలిపోయింది. ఉన్న ఒక్క గదిలోనే కార్యాలయం కొనసాగుతోంది. దీంతో హైద్యులు ఆరు బయటే మూగజీవాలకు వైద్యం అందిస్తున్నారు. మందులు, కంప్యూటర్లు భద్రపర్చుకునేందుకు గదులు లేక ఇబ్బందులు తప్పడం లేదు.
వీరఘట్టం మండలం:
- వీరఘట్టం మండలం సంతనర్సిపురం సమీపంలో రాళ్లగెడ్డ వద్ద మినీ రిజర్వాయరు నిర్మాణం కలగానే మిగిలింది. ఇక్కడ జలాశయం నిర్మిస్తే ఈ ప్రాంతంలోని ఎనిమిది గ్రామాల పరిధిలో సుమారు మూడువేల ఎకరాలకు సాగునీటి సమస్య తీరుతుంది. కుంభిడి ఇచ్చాపురం వద్ద కుంబిగెడ్డ రిజర్వాయరు నిర్మాణం చేపట్టకపోవడంతో పది గ్రామాల పరిధిలోని నాలుగువేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు.
- వీరఘట్టంలో డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు లేవు. ఇక్కడ కళాశాల ప్రారంభించి పదేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయి భవనాలు సమకూరలేదు. దీంతో జూనియర్ కళాశాలలోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు వసతి సమస్యతో సతమతం అవుతున్నారు.
- భామిని మండలం పార్వతీపురం మన్యం జిల్లా భామిని, అటు శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 15 వేవేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఎనిమిదేళ్ల కిందట చేపట్టిన నేరడి బ్యారేజీ నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో వెళ్లేల ఎకరాల భూములకు నీరందని పరిస్థితి. ప్రస్తుతం వర్షాధారంగానే ఈ మండలంలో సాగు జరుగుతోంది. ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే రైతులకు మేలు జరుగుతుంది.
- భామిని మండలంలో కొండలోవగెడ్డ జలాశయం నిర్మాణానికి ఏళ్లుగా ప్రతిపాదనలే తప్ప పనులు జరగలేదు. ఈ నిర్మాణం పూర్తయితే 2,500 ఎకరాలకు సాగునీటి సమస్య తీరుతుంది. ప్రస్తుతం వర్షాధారంగానే సాగు జరుగుతోంది. మరోవైపు వడ్డంగి వద్ద ములగమానుగెడ్డ, సీతామహాలక్ష్మి చెరువు వద్ద ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు తెదేపా హయాంలో శంకుస్థాపన చేసినా కార్యరూపం దాల్చలేదు.
- భామిని పరిధిలోని ఏబీ రహదారి అత్యంత అధ్వానంగా మారింది. రోడ్డు పొడవునా గుంతలతో వాహనాలు పాడవుతున్నాయి. దీంతోపాటు తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఘనసర మొదలుకుని బత్తిలి వరకు సుమారు 30 కి.మీ. మేర ఇదే పరిస్థితి. ఏబీరోడ్డు నుంచి పాల్చికోట, కొసలి, కీసర, ఘనసర, తాలాడ, లివిరి, నేరడి గ్రామాల రహదారులదీ ఇదే దుస్థితి ఉంది.
సీతంపేట మండలం:
సీతంపేట మండలం పలు గ్రామాల మధ్య రహదారులు గుంతలతో నిండి అధ్వానంగా మారాయి. రాకపోకలకు ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. కోడి శ కూడలి- కడగండి, కె.గుమ్మడ- ముకుందాపురం రోడ్లు బాగోలేదు. ఈతమానుగూడ, కె.గుమ్మడ- ఆనపకాయలగూడ, బూర్జిమానుగూడ వరకు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ఎగువద్వారబందం, నడిమిద్వారబందం, రంగంవలన, ఉసిరికిపాడు, పాత పెద్దగూడ తదితర గ్రామాలకు రోడ్లు లేకపోవడంతో గిరిజనులు డోలీలతో రోగులను మోసుకుని రావాల్సిన దుస్థితి ఉంది.