EC On Advisors: ఏపీ ప్రభుత్వ సలహా దారులకు ఈసీ షాక్… రాజకీయ ప్రకటనలపై వార్నింగ్… కోడ్ వర్తిస్తుందని స్పష్టీకరణ-election commission warning to ap government adviors election code applies for advisors ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec On Advisors: ఏపీ ప్రభుత్వ సలహా దారులకు ఈసీ షాక్… రాజకీయ ప్రకటనలపై వార్నింగ్… కోడ్ వర్తిస్తుందని స్పష్టీకరణ

EC On Advisors: ఏపీ ప్రభుత్వ సలహా దారులకు ఈసీ షాక్… రాజకీయ ప్రకటనలపై వార్నింగ్… కోడ్ వర్తిస్తుందని స్పష్టీకరణ

Sarath chandra.B HT Telugu

EC On Advisors: ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ రాజకీయ ప్రకటనలు చేయడంపై అభ్యంతరం తెలిపింది.

సలహాదారులపై ఈసీ సీరియస్

EC On Advisors: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకు Advisors కూడా ఎన్నికల ప్రవర్తనా Election Code నియమావళి వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పలువురు ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాజకీయ ప్రచారాల్లో పాల్గొనడం, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడంపై పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో ఈసీ సలహాదారులకు వార్నింగ్ ఇచ్చింది.

కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులైన సలహాదారులు, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచార రంగంలోకి ప్రవేశిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని కమిషన్ గుర్తించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి సహా పలువురు సలహాదారులు కోడ్ వచ్చిన తర్వాత విపక్షాలను విమర్శిస్తూ ప్రచారం చేశారు. 

సలహాదారుల తీరుపై సమీక్ష తర్వాత ప్రభుత్వ మంత్రులకు వర్తించే నియామవళి సలహాదారులకు కూడా నియమావళి వర్తిస్తుందని ఈసీఐ స్పష్టంచేసింది. Election Commission కమిషన్ ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘిచినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి, మోడల్ కోడ్‌ అమలు, సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకుంటామని ఈసీఐ స్పష్టం చేసింది.

ఆ రెండు రోజులు రాజకీయ ప్రకటనలపై నిషేధం…

పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు రాష్ట్ర/జిల్లా స్థాయిలో MCMC కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్వర్వులు జారీ చేసింది.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమవడం గుర్తించిన కమిషన్, వీటివల్ల ప్రభావితమయ్యే అభ్యర్థులు మరియు పార్టీలకు అటువంటి సందర్భాలలో వివరణ/ఖండన అందించే సమయం కూడా ఉండనందున ఎన్నికల చివరి దశలో, రాజకీయ ప్రకటనలతో మొత్తం ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది.

అలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా, ఎన్నికల సందర్భంగా ఆవేశ పూరితమైన, తప్పుదోవ పట్టించే లేదా ద్వేషపూరిత ప్రకటనల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తనకున్న అధికారాలను మరియు దానికి వీలు కల్పించే అన్ని ఇతర అధికారాలను ఉపయోగించుకుని తగు చర్యలు తీసుకుంటుందన్నారు.

రాజకీయ ప్రకటనలలోని విషయాలు రాష్ట్ర/జిల్లా స్థాయిలో MCMC కమిటీ వారి నుండి ముందస్తుగా ధృవీకరించబడినట్లయితే తప్ప, ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లేదా మరే ఇతర సంస్థ లేదా వ్యక్తి పోలింగ్ రోజున మరియు పోలింగ్ కు ఒక రోజు ముందు ప్రింట్ మీడియాలో ఎలాంటి ప్రకటనను ప్రచురించకూడదని స్పష్టం చేశారు.

వార్తాపత్రిక ప్రకటనల ముందస్తు ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి, రాష్ట్ర/జిల్లా స్థాయిలో MCMC కమిటీలను అప్రమత్తం చేయటం జరిగిందని, రాజకీయపార్టీలు, అభ్యర్థులు, ఇతర సంస్థల నుండి అందిన ప్రకటనలన్నింటినీ కమిటీలు త్వరితగతిన పరిశీలించి, ముందస్తుగా ధృవీకరిస్తాయని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వార్తాపత్రికలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రకటనల విషయంలో రాష్ట్ర/జిల్లా స్థాయిలో MCMC కమిటీ ల నుండి ముందస్తుగా అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే ప్రింట్ మీడియాలో ప్రకటనలు ప్రచురించి ఎలక్షన్ కమిషన్ కు సహకరించాలని సమాచార శాఖ అధికారులు కోరారు.

సంబంధిత కథనం