TDP JSP BJP Clean Sweep : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది. ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో టీడీపీ కూటమే విజయం దిశగా నడుస్తోంది. వైసీపీ ఒక్క ప్రాంతంలో కూడా మెజారిటీ స్థానాలు దిశగా అడుగులు వేయటం లేదు. ప్రస్తుత ట్రెండ్స్ ను బట్టీ మూడు జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధం అవుతుంది.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో టీడీపీ కూటమి అత్యధిక స్థానాలు దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ 34 స్థానాలకు గాను దాదాపు 31 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. వైసీపీ కేవలం మూడు స్థానాల్లోనే ముందంజలో ఉంది. విజయనగరం జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. తొమ్మిదికి తొమ్మిది స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంది. శ్రీకాకుళంలో పది స్థానాల్లో తొమ్మిది టీడీపీ కూటమి, ఒక స్థానంలో వైసీపీ ముందంజలో ఉన్నాయి. విశాఖపట్నంలో 15 స్థానాలకు 13 స్థానాల్లో టీడీపీ కూటమి, రెండు స్థానల్లో వైసీపీ కూటమి ముందంజలో ఉన్నాయి.
అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలకు గాను టీడీపీ కూటమి 31 స్థానాల్లో ముందంజలో ఉంది. వైసీపీ కేవలం రెండు స్థానల్లోనే ముందంజలో ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 19 స్థానాలకు గాను 19 స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అనపర్తిలో బీజేపీ గెలిచింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గానూ 13 స్థానాల్లో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉంది. రెండు స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది. పశ్చిమగోదావరిలో పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం సాధించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 33 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ కూటమి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీడీపీ కూటమి 33 స్థానాల్లో 30 స్థానాల్లో టీడీపీ కూటమి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, మూడు స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది. కృష్ణా జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది.16 స్థానాలకు 16 స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంది. అలాగే గుంటూరులో 17 స్థానాలకు 14 స్థానాల్లో టీడీపీ కూటమి, మూడు స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాల్లో 12 స్థానాలకు ఎనిమిది స్థానాల్లో టీడీపీ కూటమి, నాలుగు స్థానాల్లో వైసీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాల్లో టీడీపీ కూటమి, నాలుగు స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉన్నాయి.
రాయలసీలలో కూడా టీడీపీ కూటమి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాయలసీమలో మొత్తం 52 స్థానాల్లో 42 స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంది. వైసీపీ కేవలం పది స్థానాలకే పరిమితం అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పది స్థానాలకు ఆరు స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉండగా, వైసీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితం అయింది. కర్నూలులో 14 స్థానాలకు 12 స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉండగా, వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. అనంతపురం జిల్లాలో 14 స్థానాలకుగాను 13 స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉండగా, వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం అయింది. టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ కూటమి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు గాను టీడీపీ కూటమి 13 స్థానాల్లో ముందంజలో ఉంది. కేవలం ఒకే స్థానంలో వైసీపీ ముందంజలో ఉంది. అదీ కూడా పుంగనూరులో మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే మళ్లీ ముందంజలోకి వచ్చారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం