AP Capital Amaravati : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. మొన్నటి వరకు ఏపీ రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా పోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి విక్టరీ తర్వాత….. 'అమరావతి' మళ్లీ ప్రాణం పోసుకునే అవకాశం స్పష్టంగా ఉంది.
2019లో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టిన తర్వాత… రాజధాని విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి మాత్రమే రాజధాని కాదని… మూడు రాజధానులను ఏర్పాటు చేస్తు్న్నట్లు ప్రకటించింది. దీంతో అమరావతి పరిస్థితే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అక్కడ చేపట్టి నిర్మాణాలు కూడా వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. విశాఖ కార్యనిర్వహక రాజధానిగా, అమరావతి శాసనసభ రాజధాని అని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించారు. అందుకోసం ప్రయత్నాలు చేసినప్పటికీ… న్యాయపరమైన చిక్కులతో వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది.
అయితే తాజాగా వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా మూడు రాజధానులకే కట్టుబడి ఉంటామని చెప్పింది. కానీ టీడీపీ కూటమి భారీ విజయం సాధించటంతో…. అమరావతి శాశ్వత రాజధానిగా మారిపోనుంది. ఆగిపోయిన పనులన్నీ మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇదే విషయంపై కూటమిలోని పార్టీలు కూడా పదే పదే ప్రకటన చేశాయి. మేనిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
తాజాగా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తుండటంతో… ఏపీ రాజదాని ఏంటన్న ప్రశ్నకు పూర్తిస్థాయి సమాధానం దొరికే అవకాశం ఉంది. ఏకైక రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత… చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.