AP Counting : ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులు, కౌంటింగ్ భద్రతా చర్యలపై డీజీపీ కీలక ఆదేశాలు-amaravati dgp harish kumar gupta ordered 56 special police officials to districts for counting ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Counting : ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులు, కౌంటింగ్ భద్రతా చర్యలపై డీజీపీ కీలక ఆదేశాలు

AP Counting : ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులు, కౌంటింగ్ భద్రతా చర్యలపై డీజీపీ కీలక ఆదేశాలు

HT Telugu Desk HT Telugu

AP Counting : ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ప్రతి జిల్లాలకు నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులు, కౌంటింగ్ భద్రత చర్యలపై డీజీపీ కీలక ఆదేశాలు

AP Counting : రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం ఆయా జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు శనివారం ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు విడుదల చేశారు. మొత్తం 56 మంది పోలీస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. శనివారం సాయంత్రంలోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ప్రత్యేక పోలీస్ అధికారులకు డీజీపీ సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఏపీ డీజీపీ ఆదేశించారు.

అత్యధికంగా అధికారులు పల్నాడు జిల్లాకే

పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను కేటాయించారు. పల్నాడు‌కు కేటాయించిన అధికారుల్లో ఆరుగురు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు ఉన్నారు. కాగా ఏపీ ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తరువాత మే 13తో పాటు, 14, 15 తేదీల్లో వరుసగా మూడు రోజులుగా పల్నాడు, నరసరావు పేట, తాడిపత్రి, అనంతపురం, చంద్రగిరి, మాచర్ల, తిరుపతి పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల చోటు చేసుకున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీకి ఈసీ ఆదేశించింది. ఈ అల్లర్లను తీవ్రంగా తీసుకొన్న కేంద్ర ఎన్నికల సంఘం, హింసాత్మక ఘటనలపై తమ ముందు నేరుగా హాజరుకావాలని సీఎస్, డీజీపీలకు నోటీసులు ఇచ్చి ఎన్నికల సంఘం పిలుపించుకుంది.

ఎస్పీలు, కలెక్టర్ సస్పెండ్

దిల్లీలోని నిర్వచన్ సదన్ లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్ల జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ముందు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాలు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పల్నాడు కలెక్టర్ పైన వేటు వేసింది. అలాగే శాఖాపరమైన విచారణ ప్రారంభం అయినట్లు తెలిపింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి మూడు జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో హింసపై నమోదైన ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని, సిట్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదించాలని ఆదేశించింది.

పునరావృతం కావొద్దు: ఈసీ

ఈసీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతర హింసపై తన అసంతృప్తిని తెలియజేసింది. ఇలాంటి హింస పునరావృతం కాకుండా చూడాలని సీఎస్‌, డీజీపీలకు కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరినీ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ దాని స్థాయిలో కేసులను సమీక్షించింది. చట్ట ప్రకారం, మోడల్ కోడ్ పరిధిలో ఉన్న దోషులపై ఛార్జిషీట్‌ను సకాలంలో దాఖలు చేయడంపై తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది.

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత పటిష్టం చేయాలని ఈసీ సూచించింది.‌ కౌంటింగ్ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఫలితాల ప్రకటన తరువాత సాధ్యమయ్యే హింసను నియంత్రించడానికి 25 సీఎపీఎఫ్ కంపెనీలను కౌంటింగ్ తర్వాత 15 రోజుల పాటు ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో కౌటింగ్‌ను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే భారీగా పోలీసు అధికారులను నియమించినట్లు తెలుస్తోంది.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం