ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట ఫ్రాంఛైజీలు అన్నీ తాము రిటెన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాని బీసీసీఐకి గురువారం (అక్టోబరు 31) లోపు సమర్పించాల్సి ఉంది. నవంబరు ద్వితీయార్థంలో మెగా వేలం జరగనుండగా.. కొంత మంది స్టార్ ప్లేయర్లు తమ పాత జట్టుని వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్ ప్రకారం.. ప్రతి ఫ్రాంఛైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటెన్ చేసుకోవచ్చు. అలానే వేలం సమయంలో ఒక ప్లేయర్ని రైట్-టు-మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు ద్వారా దక్కించుకునే ఛాన్స్ ఛాన్స్ ఉంటుంది. ఐపీఎల్ 2025 వేలం కోసం ప్రతి ఫ్రాంచైజీకి రూ .120 కోట్లు కేటాయించగా.. వేలానికి ముందే రిటెన్షన్ కోసం రూ.75 కోట్లు వరకు ఫ్రాంఛైజీలు ఖర్చు చేసుకోవచ్చు.
సాధారణంగా అన్ని ఫ్రాంఛైజీలు తమ టీమ్ను గెలిపించే ప్లేయర్లని, ఫామ్, క్రేజ్ ఆధారంగా రిటెన్ చేసుకుంటాయి. కొన్ని ఫ్రాంఛైజీలు గత కొన్నేళ్లుగా కొంత మంది ప్లేయర్లని వదలకుండా రిటెన్ చేసుకుంటూనే ఉన్నాయి. అలాంటి ప్లేయర్ జాబితాలో ఉన్న ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. సుదీర్ఘకాలం తర్వాత ఆ జట్టుని వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ టీమ్ నుంచి హార్దిక్ పాండ్యాని మళ్లీ ముంబయి ఇండియన్స్ టీమ్లోకి తెచ్చుకుని కెప్టెన్సీ కూడా ఇవ్వడాన్ని రోహిత్ శర్మని బాధిస్తోంది. గత ఏడాది రోహిత్ శర్మ బ్యాటింగ్లో ఫెయిలవగా.. ముంబయి టీమ్ అత్యంత చెత్త ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ్స్కి కూడా చేరలేకపోయింది. దాంతో రోహిత్ శర్మని మళ్లీ కెప్టెన్ను చేయాలంటూ ముంబయి ఇండియన్స్ అభిమానుల నుంచి డిమాండ్ పెరిగిపోయింది.
కానీ.. రోహిత్ ఆ టీమ్లోనే ఉండకూడదని వేలంలోకి వెళ్లడం ద్వారా వేరే జట్టులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో చాలా టీమ్స్ భారత్కి చెందిన కెప్టెన్సీ అనుభవం ఉన్న ప్లేయర్ కోసం నిరీక్షిస్తున్నాయి. రోహిత్ వేలానికి వస్తే రూ.18 కోట్ల వరకూ వెచ్చించి మరీ దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది.
రిషబ్ పంత్కి అత్యంత క్లిష్ట సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ అండగా నిలిచింది. 2022 డిసెంబరులో పంత్ కారు ప్రమాదానికి గురవగా.. ఐపీఎల్ 2023లో ఆడలేకపోయినా అతని జెర్సీని ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్లో గౌరవార్థం ఉంచింది. ఐపీఎల్ 2024లో అతను రీఎంట్రీ ఇవ్వగానే మళ్లీ పగ్గాలిచ్చి గౌరవించింది. కానీ.. తాను వేలంలోకి వస్తే ఎంత ధరకి అమ్ముడుపోతాను? అని స్వయంగా పంత్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు.
ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్ ప్రకారం రిషబ్ పంత్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్గా రిటెన్ చేసుకుంటే ఫ్రాంఛైజీ రూ.18 కోట్లు ఇస్తుంది. కానీ.. పంత్ అంతకు మించి.. అనేలా ఉన్నాడు. దాంతో తాను వేలంలోకి వెళ్లాలని పంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వికెట్ కీపర్/లెప్ట్ హ్యాండ్ బ్యాటర్/కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ.. వేలంలో రిషబ్ పంత్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడదు.
భారత్ జట్టు సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ని వేలంలోకి వదిలేయాలని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫామ్ కోల్పోయిన రాహుల్.. చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండటంతో జట్టు ఓడిపోతోందని లక్నో ఫ్రాంఛైజీ భావిస్తోంది. దాంతో అతడ్ని వేలంలోకి వదిలేయాలని నిర్ణయించుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ అతడ్ని జట్టులోకి తీసుకోవాలని ఆశిస్తోంది.
గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్కి కేఎల్ రాహుల్ ఆడిన విషయం తెలిసిందే. దానికి తోడు కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్లేయర్ కావడంతో.. బెంగళూరు పిచ్ అతనికి కొట్టినపిండి. ప్రతి టీమ్ సొంత మైదానంలో ఏడు మ్యాచ్లు ఆడనున్న విషయం తెలిసిందే. రాహుల్ ఒక్కసారి లయ అందుకుంటే టీ20ల్లో చాలా నిలకడగా ఆడగలడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆఖరి వరకూ క్రీజులో నిలవగలడు. ఇలాంటి ప్లేయర్ కోసమే చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ కూడా చూస్తున్నాయి. దాంతో ఆర్సీబీకి పోటీగా రాహుల్ కోసం ఈ రెండు ఫ్రాంఛైజీలు వేలానికి వస్తే అతని ధర అమాంతం పెరిగే అవకాశం ఉంది.