ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అదిరే బోణీ కొట్టింది. ఈ సీజన్లో తన ఫస్ట్ మ్యాచ్లో ఆదివారం (మార్చి 23) రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 44 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర విషయం జరిగింది. ఫీల్డింగ్ చేస్తున్న భారత ప్లేయర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని పెళ్లి గురించి ఫ్యాన్స్ అడిగారు.
రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్కు నిలబడ్డాడు ఎస్ఆర్ఎహెచ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఇంతలో స్టాండ్స్ నుంచి కొందరు అభిమానులు ‘మ్యారేజ్ ఎప్పుడు బ్రో’ అంటూ అరిచారు. అమ్మాయిలు సచ్చిపోతున్నారు అయ్యా అంటూ కామెంట్లు చేశారు. దీంతో నితీశ్ లోలోపల నవ్వుకున్నట్టు కనిపించారు.
బ్రో లవ్ మ్యారేజా అని మళ్లీ గట్టిగా అరుస్తూ నితీశ్ కుమార్ రెడ్డిని అడిగారు ఫ్యాన్స్. దీనికి నితీశ్ రియాక్ట్ అయ్యారు. కాదు అనేలా తలను అడ్డంగా ఊపారు. మొత్తంగా మైదానంలోనే పెళ్లి గురించి అభిమానులు అడిగేశారు. గత సీజన్ ఐపీఎల్లో అదరగొట్టిన నితీశ్.. టీమిండియాలో అరంగేట్రం చేసి సత్తాచాటాడు. దీంతో ఈ తెలుగు ఆటగాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
రాజస్థాన్తో మ్యాచ్లో హైదరాబాద్ సన్రైజర్స్ చెలరేగిఆడింది. గత సీజన్ బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. గతేడాది హయ్యెస్ట్ స్కోరు (287) పరుగులు చేసిన హైదరాబాద్.. ఇప్పుడు అందుకు ఒక్క పరుగు తక్కువ చేసింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ (106 నాటౌట్) అజేయ సెంచరీతో దుమ్మురేపాడు. హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ఫస్ట్ మ్యాచ్లోనే శతకంతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్ (67 పరుగులు) బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ ఆడగా.. హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30) ఉన్నంతసేపు హిట్టింగ్ చేశారు.
లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ పోరాడింది. 20 ఓవర్లలో 6 వికెట్లు 242 పరుగులు చేసి ఓడిపోయింది. సంజూ శాంసన్ (66 పరుగులు), ధృవ్ జురెల్ (70) మెరుపు అర్ధ శతకాలు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఆ రేంజ్లో హిట్టింగ్ చేయలేకపోవటంతో భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ అందుకోలేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్ తలా రెండు వికెట్లు తీయగా.. షమీ, జంపా చెరొకటి దక్కించుకున్నారు.
సంబంధిత కథనం