ఐపీఎల్ 2025 మళ్లీ జరుగుతుందా? మొత్తానికే రద్దు చేస్తారా లేక రీషెడ్యూల్ చేస్తారా?-what next for ipl 2025 will it be cancelled or rescheduled or shifted what happens next ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్ 2025 మళ్లీ జరుగుతుందా? మొత్తానికే రద్దు చేస్తారా లేక రీషెడ్యూల్ చేస్తారా?

ఐపీఎల్ 2025 మళ్లీ జరుగుతుందా? మొత్తానికే రద్దు చేస్తారా లేక రీషెడ్యూల్ చేస్తారా?

Hari Prasad S HT Telugu

ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలుసు కదా. మరి ఈ సీజన్ పరిస్థితి ఏంటి? మళ్లీ జరుగుతుందా? మొత్తంగా రద్దు చేస్తారా? ఒకవేళ జరిగితే ఎప్పుడు? ఎక్కడ అనే వివరాలు చూద్దాం.

ఐపీఎల్ 2025 మళ్లీ జరుగుతుందా? మొత్తానికే రద్దు చేస్తారా లేక రీషెడ్యూల్ చేస్తారా? (IPL)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 205) అనూహ్యంగా నిరవధికంగా వాయిదా పడటం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురువారం (మే 8) పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ ను అర్ధంతరంగా రద్దు చేసిన బీసీసీఐ.. ఇప్పుడు మొత్తంగా టోర్నీనే నిరవధిక వాయిదా వేసింది. మరి ఈ సీజన్ మళ్లీ జరుగుతుందా లేక మొత్తంగా రద్దు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

ఫ్రాంఛైజీలకు బీసీసీఐ చెప్పిందేంటి?

ఐపీఎల్ 2025ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మాత్రమే ఫ్రాంఛైజీలతో బీసీసీఐ వెల్లడించింది. అయితే మళ్లీ నిర్వహిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏషియా కప్ సెప్టెంబర్ లో జరగనుంది. ఆగస్ట్ లో బంగ్లాదేశ్ పర్యటన కూడా సందేహంగానే ఉంది. దీంతో ఆ సమయంలో ఐపీఎల్లో మిగిలిన 16 మ్యాచ్ లను పూర్తి చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఈ విషయంపై బీసీసీఐ అధికారులు ప్రభుత్వంతోనూ మాట్లాడారు. అయితే ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి టోర్నీని వాయిదా వేయడమే మంచిదని బోర్డు నిర్ణయించింది. అంతేకాదు చాలా మంది విదేశీ ప్లేయర్స్ తమ భద్రతపై ఆందోళనతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్లేయర్స్ అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నట్లు తెలిసింది.

టోర్నీని షిఫ్ట్ చేస్తారా?

ఇప్పటికే పాకిస్థాన్ సూపర్ లీగ్ ను అక్కడి బోర్డు యూఏఈకి తరలించింది. మరి ఐపీఎల్ ను కూడా మరో చోటికి తరలించి నిర్వహిస్తారా లేదా అన్నది చూడాలి. మరో 16 మ్యాచ్ లు ఉన్నాయి. పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ ను కూడా అర్ధంతరంగా నిలిపేయడంతో అది కూడా కలిపితే 17 అవుతాయి.

జూన్, జులైలో ఇంగ్లండ్ పర్యటన కోసం ఇండియన్ టీమ్ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ లోనే మళ్లీ అవకాశం ఉంటుంది. అయితే ఆ సమయంలో ఇండియాలో వర్షాలు కురుస్తుంటాయి. అంతేకాదు విదేశీ ప్లేయర్స్ అందుబాటులో ఉండటం అనేది కూడా ఓ సవాలే.

2021లోనూ ఇలాగే..

చివరిసారి ఐపీఎల్ ను ఇలా అర్ధంతరంగా వాయిదా వేసిన సందర్భం 2021లో జరిగింది. అప్పుడు కొవిడ్ కారణంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పుడు టోర్నీలో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో ప్రేక్షకులను అనుమతించకుండా ఏడాది చివర్లో నిర్వహించారు.

మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఇది బీసీసీఐకి ఇది క్లిష్ట పరిస్థితే. ఈ ఏడాది మళ్లీ ఐపీఎల్ ను నిర్వహించడం సాధ్యం కాకపోతే అది బోర్డుకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కూడా మిగులుస్తుంది. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం