GT vs PBKS: మ్యాచ్ను మలుపుతిప్పిన పంజాబ్ కింగ్స్ బౌలర్.. క్రెడిట్ ఇచ్చిన శ్రేయర్.. ఆర్సీబీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
GT vs PBKS IPL 2025 - Vyshak Vijaykumar: పంజాబ్ కింగ్స్ బౌలర్ వైశాఖ్ విజయ్కుమార్ అదరగొట్టాడు. కీలకమైన సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కళ్లెం వేసి.. పంజాబ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఏం జరిగిదంటే..
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ సూపర్ ఆరంభం అందుకుంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం (మార్చి 25) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను పంజాబ్ 11 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్లో దుమ్మురేపిన శ్రేయ్యర్ సారథ్యంలోని పంజాబ్.. ఆ తర్వాత చివరి ఓవర్లలో మెరుగైన బౌలింగ్తో మ్యాచ్ను కాపాడుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన యంగ్ పేసర్ వైశాఖ్ విజయ్ కుమార్ తన బౌలింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పి ఒక్క వికెట్ తీయకుండానే హీరో అయ్యాడు.
యార్కర్లతో అదుర్స్.. మ్యాచ్ టర్న్
244 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 14 ఓవర్లలో 2 వికెట్లకు 169 రన్స్ చేసింది. విజయానికి ఆరు ఓవర్లలో 75 పరుగులు చేయాల్సింది. జాస్ బట్లర్, రూథర్ఫర్డ్ సూపర్ హిట్టింగ్ చేస్తుండడం.. పిచ్ బ్యాటింగ్కు బాగుండటంతో పంజాబ్ కింగ్స్ ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో వైశాఖ్ విజయ్ కుమార్ను బౌలింగ్కు దింపాడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. 15వ ఓవర్లో వైడ్ యార్కర్లతో వైశాఖ్ అదరగొట్టాడు. బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. హిట్టింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. 15వ ఓవర్లో కేవలం 5 పరుగులే ఇచ్చి మ్యాచ్ను పంజాబ్వైపు తిప్పాడు వైశాఖ్. తర్వాతి ఓవర్లో జాన్సెన్ 8 రన్స్ ఇచ్చాడు.
17వ ఓవర్లోనూ వైశాఖ్ విజయ్కుమార్ మ్యాజిక్ చేశాడు. అద్బుతమైన బంతులతో రూథర్ఫర్డ్ను ముప్పుతిప్పలు పెట్టాడు. మూడు వైడ్లు వేసినా మొత్తంగా ఐదు పరుగులే ఇచ్చాడు. దీంతో గుజరాజ్ తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయింది. మూడు ఓవర్లకే 56 పరుగులు చేయాల్సిన స్థితికి వచ్చింది. 19వ ఓవర్లో వైశాఖ్ 18 పరుగులు ఇచ్చినా.. అప్పటికే అతడు చేయాల్సిన పనంతా చేసేశాడు. గుజరాత్ను అడ్డుకున్నాడు. మొత్తంగా పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రశంసించిన కెప్టెన్ శ్రేయస్
కీలకమైన 15, 17 ఓవర్లలో చెరో ఐదు పరుగులే ఇచ్చి పంజాబ్ వైపు మ్యాచ్ను మలుపుతిప్పి గెలుపులో కీలకపాత్ర పోషించాడు వైశాఖ్. వరుసగా వైడ్ యార్కర్లు వేస్తూ వావ్ అనిపించాడు. వికెట్ తీయకపోయినా మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చేశాడు. వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడని, అది అంత సులువు కాదని మ్యాచ్ తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. సరైన లైన్, లెంగ్త్ వేశాడని, అతడికి క్రెడిట్ ఇస్తున్నానని అన్నాడు.
గతేడాది ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు సారథ్యం వహించిన శ్రేయస్.. ఈ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ టీమ్కు వచ్చేశాడు. తొలి మ్యాచ్లోనే పంజాబ్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో 42 బంతుల్లోనే 97 పరుగులతో దుమ్మురేపి అజేయంగా నిలిచాడు శ్రేయస్. సెంచరీ కోసం ఆశించకుండా చివర్లో ఓవర్లో శశాంక్ శర్మనే స్ట్రైకింగ్ చేయాలంటూ నిస్వార్థం చూపాడు. శశాంక్ 16 బంతుల్లో 44 పరుగులు (నాటౌట్) ధనాధన్ హిట్టింగ్తో చెలరేగాడు. మొత్తంగా పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్లో 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. గుజరాత్ 5 వికెట్లకు 232 పరుగులు చేసి, ఓడింది.
ఆర్సీబీపై ట్రోలింగ్
పంజాబ్ కింగ్స్ బౌలర్ వైశాఖ్ విజయ్కుమార్ అదరగొట్టడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఈ బౌలర్ గత రెండు సీజన్లు ఆర్సీబీకే ఆడాడు. అయితే, ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ దక్కించుకోలేదు. దీంతో పంజాబ్ సొంతం చేసుకుంది. ఇలాంటి బౌలర్ను ఎలా వదులుకున్నారంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి తప్పిదాలు చేస్తుండడం వల్లే ఇంకా టైటిల్ దక్కలేదంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.
సంబంధిత కథనం